జగదీశ్‌రెడ్డి, కిషన్‌రెడ్డి పరస్పర పశ్చాత్తాపం

జగదీశ్‌రెడ్డి, కిషన్‌రెడ్డి పరస్పర పశ్చాత్తాపం


సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి గురువారం సభలో పరస్పరం పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విద్యుత్‌ పద్దుపై బుధవారం సాయంత్రం జరిగిన చర్చలో  జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ రాష్ట్రానికి కోట్ల రూపాయలేమైనా ఇచ్చారా? లోయర్‌ సింగూరు ప్రాజెక్టు కుట్రలో భాగంగా ఏడు మండలాలను చంద్రబాబుకు అప్పగించారు’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో కిషన్‌రెడ్డి వెల్‌లోకి వచ్చి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.


మంత్రి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై గురువారం సభ ప్రారంభమవగానే మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. తాను పొరపాటుగా మాట్లాడలేదని, ఏమైనా అభ్యంతరకర వ్యాఖ్యలుంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘గత ముఖ్యమంత్రులు వైఎస్‌ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల సమయంలోనూ అసెంబ్లీ వేదికగా పోరాటం చేశాను. మోదీపై విమర్శలు చేయడంతో తొందరపడ్డాను. వెల్‌లోకి వచ్చినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను’ అని ప్రకటించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top