ప్రతిపాదనలు

ప్రతిపాదనలు


రైల్వేశాఖకు పంపిన ఎంపీలు



సాక్షి, హన్మకొండ : 2014-15 రైల్వే బడ్జెట్‌పై రైల్వేశాఖ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన పనులపై ఎంపీల నుంచి నివేదికలు స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందిగా మన ఎంపీలు ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వేబోర్డుకు పంపించారు.



కాజీపేట కేంద్రంగా కాకతీయ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయూలని.. సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌ను విభజించాలి.. వ్యాగన్ వర్క్‌షాప్ పనులు ప్రారంభించాలని.. స్టేషన్లలో మౌలిక సదుపాయలు మెరుగుపర్చాలని.. కొత్త మార్గాలకు నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపింనట్లు ఎంపీలు తెలిపారు. వీటిలో ఎన్ని ఆమోదం పొందుతాయో రైల్వే బడ్జెట్ వరకు వేచి చూడాలి.



కాకతీయ పేరిట డివిజన్ ఏర్పాటు చేయూలి

- రాపోలు ఆనందభాస్కర్, ఎంపీ

 

రైల్వే డివిజన్ హోదాకు అన్ని హంగులు ఉన్న కాజీపేట కేంద్రంగా కాకతీయ పేరిట కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. ఈ డివిజన్ ఏర్పాటుపై రైల్వేబోర్డు సానుకూలంగా ఉన్నా.. నిర్ణయం వెలువడటంలో జాప్యం జరుగుతోంది. ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో ప్రకటన చేయాల్సిందిగా రైల్వేమంత్రిని కోరాను. రద్దీ అధికంగా ఉన్న బల్లార్షా-కాజీపేట-విజయవాడ మార్గంలో మూడో లైను నిర్మాణ పను లు చేపట్టాలి. అదేవిధంగా స్టేషన్‌ఘన్‌పూర్- పాలకుర్తి-సూర్యాపేట-నల్గొండ వరకు కొత్తరైల్వే లైన్ నిర్మించాలి. వీటి కోసం రెండేళ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నాను.



కాజీపేట జంక్షన్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయూలి. కాజీపేట, వరంగల్ స్టేషన్లలో మూడో నంబరు ఫ్లాట్‌ఫాంపై అప్రాన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. పెండింగ్‌లో ఉన్న వ్యాగన్ వర్క్‌షాపు పనులు ప్రారంభించాలి. విజయవాడలో ఉన్నటువంటి ఉద్యోగుల శిక్షణ కేంద్రం మాదిరిగా కాజీపేటలో కూడా మరొ శిక్షణ కేంద్రం అవసరం ఉంది. సికింద్రాబాద్, విజయవాడ స్థాయిలో డీజిల్, ఎలక్ట్రికల్ లోకోల మెయింటెనెన్స్‌ను కాజీపేటలో ఏర్పా టు చేయాలి.   



డోర్నకల్ ప్రాధాన్యత గుర్తించాలి

- సీతారాంనాయక్, మానుకోట ఎంపీ

 

భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం)-కొవ్వూరు రైల్వేలైను నిర్మాణం పూర్తయితే డోర్నకల్ జంక్షన్‌కు పూర్వవైభవం వస్తుంది. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించేలా రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకొస్తా. బొగ్గు నిక్షేపాల ప్రాంతాలు కలుపుతూ మణుగూరు-రామగుండం మధ్య కొత్త రైల్వే మార్గానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాం.



ఈ రైలు మార్గంతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. భద్రాచలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వేలైన్ నిర్మాణ పనులు ప్రారంభించాలి. డోర్నకల్-సింగరేణికాలరీస్ (ఇల్లందు) మధ్య రద్దరుున ప్యాసింజర్ రైలును పునఃప్రారంభించాలి. గతంలో సర్వే పూర్తరుున డోర్నకల్-మిర్యాలగూడ మార్గానికి నిధులు కేటాయించాలి. భద్రాచలం రోడ్డు-తిరుపతి మధ్య కొత్తగా ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలి.



మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి..

- ఎంపీ సుధారాణి, ఎంపీ



కాజీపేట కేంద్రంగా దేశంలో వివిధ ప్రాంతాలకు కొత్తగా రైళ్లను ప్రారంభించాలి. అందుకు అనుగుణంగా ఇక్కడ పిట్‌లైన్లు, ఫ్లాట్‌ఫాంల సంఖ్య పెం చాలి. వీటితోపాటు వ్యాగన్ వర్క్‌షాప్‌ల భూ కేటాయింపులకు నిధులు మంజూరు అయ్యాయి. కాబట్టి వ్యాగన్ వర్క్‌షాపు పనులు వేగవంతం చేయాలి. కాజీపేటలో ఉన్న రైల్వే ఆస్పత్రి అప్‌గ్రేడ్ పనులు  సకాలంలో పూర్తి చేయాలి. కాజీపేటలో రెం డో  ఫుట్  ఓవర్ బ్రిడ్జి, లిఫ్టు సౌకర్యాలు కల్పించాలి.



ఎక్స్‌ప్రెస్‌లకు జనగామలో హాల్టింగ్ ఇవ్వాలి

- బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎంపీ



జిల్లాలో రెండో పెద్ద పట్టణమైన జనగామ నుంచి నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు హైదరాబాద్, వరంగల్‌లకు ప్రయాణం చేస్తుంటారు. కానీ ఇక్కడ చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ లేదు. పరిమిత సంఖ్యలో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. జనగామ స్టేషన్‌లో కొత్తగా పది ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాల్సిందిగా రైల్వేబోర్డుకు లేఖ రాశాను. వీటిలో శాతవాహన, కోణార్క్, గోదావరి, నాందేడ్, సింహపురి, పాట్నా వంటి రైళ్లు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top