దైవ దర్శనానికి వచ్చి.. అనంతలోకాలకు

దైవ దర్శనానికి వచ్చి.. అనంతలోకాలకు - Sakshi


మనూరు: పూజలు చేసేందుకు వచ్చిన కర్ణాటక ప్రాంత వాసులు రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. మనూరు మండలం రాయిపల్లి మంజీర వంతెన సమీపంలో రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన దేవేంద్రప్ప(38), కాశీనాథ్(35), రాంచంద్ర(36), కట్టమని సోమ్‌నాథ్ (30) ఇండికా కారులో అల్లాదుర్గంలోని ఎల్లమ్మ ఆలయానికి వచ్చారు.



ఇండికా కారును డ్రైవర్ సతీష్ (28) నడుపుతున్నాడు. అల్లాదుర్గంలోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి తిరుగు ప్రయాణంలో రాయిపల్లి వంతెన సమీపంలోకి రాగానే జహీరాబాద్ నుండి రాయిపల్లివైపునకు వస్తున్న లారీ(ఏపీ29వీ 0215) ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ సతీష్, దేవేంద్రప్పలు అక్కడికక్కడే మృతి చెందారు. కాశీనాథ్, రాంచంద్ర, సోమ్‌నాథ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి మనూరు ఎస్‌ఐ ఏడుకొండలు, సిబ్బంది చేరుకొని బాధితులను నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సంఘటన జరిగిన అనంతరమే స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 వాహనం ఆలస్యంగా రావడంపై రాయిపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top