గాంధీ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్


గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు.  మహిళ చెవి పక్కన పెరుగుతున్న ఆరుకిలోల బరువుగల కణితిని విజయవంతంగా తొలగిం చారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పేరినసింగారం గ్రామానికి చెందిన నాగమ్మ (56) ఎడమచెవికి ఆనుకుని పెరుగుతన్న కణితితో 20 ఏళ్లుగా బాధపడుతోంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది.



 స్థానిక వైద్యుల సూచన మేరకు ఈనెల 12న గాంధీ ఆస్పత్రికి వచ్చింది. వైద్యపరీక్షలు నిర్వహించి ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని సర్జరీ వైద్యుడు ఆర్. రఘు ఆధ్వర్యంలో సోమవారం సుమారు రెండున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి  కణితిని  తొలగించారు. దీనిని పేరోటిడ్ ట్యూమర్ అంటారని, 25 ఏళ్ల క్రితం శస్త్రచికిత్స చేసి ట్యూమర్‌ను తొలగించినా మళ్లీ పెరిగిందని డాక్టర్ రఘు తెలిపారు. రెండోసారి ఆపరేషన్ ప్రమాదంతో కూడుకున్నదైనప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించామన్నారు. నాగమ్మ కోలుకుంటుందన్నారు. లక్షలాది రూపాయల వ్యయం అయ్యే అరుదైన  ఆపరేషన్‌ను గాంధీ ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించామన్నారు.



 ఆపరేషన్ నిర్వహించిన వైద్యు లు ఆర్.రఘు, ఎల్.రమేష్, బాలాజీ, హరినాథ్, జ్యోతి, పీజీలు సురయ్య, రవీందర్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.ఎస్.అశోక్‌కుమార్, ప్రిన్సిపాల్ శ్రీలత అభినందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top