దొడ్దిదారి బదిలీలపై వీఆర్వోల గుర్రు


జీఓను కాదని ఇష్టారాజ్యం

రెగ్యులరైజేషన్ పేరుతో  వేధింపులు

అందని ఇంక్రిమెంట్లు..

అరకొర జీతాలు

 


హన్మకొండ అర్బన్:  దొడ్డిదారిన బదిలీలు చేయడంపై వీఆర్వోలు గుర్రుగా ఉన్నారు. అత్యవసరమైతే తప్ప బదిలీకి అవకాశం లే ని ప్రస్తుత పరిస్థితుల్లో జరిగిన ఈ ఘటనను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారులకు వాస్తవ పరిస్థితులు వివరించకుండా కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని వీఆర్వోలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయూన్ని వీఆర్వోల సంఘం నాయకులు  కలెక్టర్, జేసీలకు వివరించినట్లు సమాచారం. వీఆర్వోల సర్వీసు క్రమబద్ధీకరణలో కలెక్టరేట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2008నుంచి ఈ విషయంలో వీఆర్వోలది అరణ్యరోదనే అవుతోంది. పెరిగిన పీఆర్సీ ప్రకారం సుమారు ఒక్కో వీఆర్వోకి కనీసం రూ. 14వేల వేతనం కోత పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్, జేసీ సానుకూలంగానే ఉన్నా కిందిస్థారుు సిబ్బంది కొర్రీలు వేస్తున్నారని మండిపడుతున్నారు.  



తెరపైకి కొత్త నిబంధనలు

 జీవో 458ప్రకారం వీఆర్‌ఏ నుంచి పదోన్నతిపై వీఆర్వో అరుున వారు  గరిష్టంగా రెండేళ్ల సర్వీసులో ఒక ఏడాది ఎలాంటి రిమార్కు లేకుండా ఉంటేనే సర్వీసు రెగ్యులర్ చేస్తారు. ఇంతకాలం ఇలాగే చేశారు. ఇటీవల కొందరు అధికారులు సర్వీసు రెగ్యులరైజేషన్‌కు పోలీస్ విచారణ నివేదిక, సర్వే శిక్షణ పూర్తి చేసి ఉండాలని మెలిక పెట్టారు. దీంతో తాము నష్టపోతున్నామని వీఆర్వోలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ కారణాలతోనే 2008నుంచి వీఆర్వోలకు తహసీల్దార్లు ఇంక్రిమెంట్లు చేయడంలేదు. అదేంటని అడిగితే కలెక్టరేట్ నుంచి సర్వీసు రెగ్యులర్ చేసుకుని రావాలని తేల్చేస్తున్నారు.  



 దొడ్డిదారిలో బదిలీలు

 ఉద్యోగుల ఇంక్రిమెంట్లు ఏడేళ్లుగా ఆగినా పట్టించుకోని అధికారులు.. నిషేధం ఉన్నా దొడ్డిదారిలో వీ ఆర్వోల బదిలీకి పూనుకున్నారనే విమర్శ విన్పిస్తోం ది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నతాధికారులకు మెడికల్ గ్రౌండ్‌లో దరఖాస్తులు చేసుకున్నవారి వివరాలు పంపి బదిలీలకు ప్రతిపాదనలు చేయాలి. దీన్ని అధికారులు విస్మరించారు. ప్రజాప్రతినిధుల లేఖలు, సంఘం నాయకులకు సిఫార్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నారుు.  



 ఎందుకీ వివక్ష?

 జిల్లాలో ఇప్పటివరకు సుమారు ఆరుగురు వీఆర్వోలు వివిధ కారణాలతో మెడికల్ గ్రౌండ్‌లో బదిలీకి అర్జీ పెట్టుకున్నారు. వీరి విషయంలో మందకొడిగా ఉన్న ఫైళ్లు మిగతా బదిలీ విషయంలో అత్యంత వేగంగా ముందుకుసాగాయి. గుట్టుచప్పుడు కాకుండా బదిలీల తతంగం పూర్తవుతోంది.

     

దేవరుప్పుల మండలంలో పనిచేస్తున్న వీఆర్వోను హసన్‌పర్తి మండలానికి తెచ్చేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు హసన్‌పర్తి మండలం చింతగట్టు వీఆర్వోను నాగారానికి బదిలీ చేసి ఆ స్థానంలో తాము అనుకున్న వ్యక్తికి పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణ ఉంది.హన్మకొండ మండలంలో పోస్టింగ్ పొందిన వీ ఆర్వో కొంతకాలంగా వరంగల్ మండలంలో డి ప్యూటేషన్‌పై పనిచేస్తున్నాడు. ఆయన్ను హన్మకొండ నుంచి వరంగల్‌కు బదిలీ చేశారు.



పరకాలటౌన్ వీఆర్వోను హన్మకొండ మండలం తిమ్మాపూర్‌కు గుట్టుచప్పుడు కాకుండా పోస్టింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారాల్లో పెత్త మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయని ఆరోపణలు వినిపిన్నాయి. సెక్షన్ వారిని ప్రసన్నం చేసుకుంటే  ఏ సెక్షన్ ప్రకారం బదిలీకి దరఖాస్తు చేసుకోవాలో వారే సలహాలిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తూ మంచి స్థానాలకు వెళ్లాలని నిరీక్షించే వారికి మాత్రం నిరాశే మిగులుతోంది.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top