‘ఆటవిక’ అధికారి

బెల్ట్‌షాపులో మద్యం తాగుతున్న రేంజర్‌ సదానందాచారి - Sakshi

- జాతీయ జెండాను అవమానించిన రేంజర్‌ 

పతాకావిష్కరణ సమయంలో బెల్ట్‌ షాపులో తాగుతూ... 

 

అశ్వారావుపేట రూరల్‌: దేశమంతా స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోతే.. ఓ అటవీశాఖ రేంజర్‌ మాత్రం జాతీయ జెండా ఆవిష్కరించాల్సిన సమయంలో మద్యం తాగుతూ కూర్చున్నాడు. మద్యం మత్తులో కిందిస్థాయి సిబ్బందిపై చిందులేస్తూ.. ఆవిష్కరణకు సిద్ధం చేసిన జెండాకర్రను ఓ మూలన పెట్టించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురంలో మంగళవారం జరిగింది. అచ్యుతాపురం క్రాస్‌ రోడ్‌లోని ఫారెస్ట్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో రేంజర్‌గా పని చేస్తున్న సదానందాచారి ఉదయం జెండావిష్కరణ సమయంలో మద్యం మత్తులోనే కార్యాలయానికి వచ్చాడు.



స్వాతంత్య్ర వేడుకల కోసం అప్పటికే సిబ్బంది జాతీయ జెండా, మహాత్మాగాంధీ చిత్రపటం, కొబ్బరికాయలు, మిఠాయిలు, బిస్కెట్లు సిద్ధం చేశారు. జెండా ఎగుర వేసే సమయానికే కార్యాలయానికి చేరుకున్న రేంజర్‌.. తాపీగా సిగరెట్‌ తాగుతూ జాతీయ జెండా, ఇతర సామగ్రిని లోపల పెట్టాలంటూ సిబ్బందిని ఆదేశించాడు. ‘సార్‌.. జెండా ఎగరేయాలి కదా.. లోపల పెడితే ఎలా’అని ప్రశ్నించడంతో ‘ఇప్పుడే వస్తా’నని చెప్పి కారులో అశ్వారావుపేటలోని ఓ బెల్ట్‌షాపులోకి వెళ్లి మద్యం తాగాడు. గమనించిన స్థానికులు మీడియాకు సమాచారం అందించగా.. రేంజర్‌ వ్యవహార శైలి వెలుగులోకి వచ్చింది. మీడియా రేంజర్‌ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరిస్తుండగా మద్యం తాగి వచ్చిన రేంజర్‌ కిందిస్థాయి సిబ్బందిపై చిందులేశాడు. 

 

బీరు మాత్రమే తాగా : రేంజర్‌

ఈ ఘటనపై రేంజర్‌ సదానందాచారిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మద్యం సేవించిన మాట వాస్తవమేనని, అయితే బీరు మాత్రమే తాగానని చెప్పాడు. పైగా అది ఆల్కహాల్‌ కాదంటూ సెలవిచ్చాడు. జాతీయ జెండా ఎందుకు ఆవిష్కరించలేదని అడిగితే మరిచిపోయానని.. ఒకసారి, ఎగురవేసిన తర్వాత తీసి కార్యాలయంలో పెట్టించానని, మరోసారి పొంతన లేని సమాధానాలు ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.



టేబుల్‌పై సిద్ధంగా ఉంచిన జాతీయ జెండా, కొబ్బరికాయలు, ఇతర సామగ్రి 



Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top