అందుబాటులో ఉంటా..

అందుబాటులో ఉంటా..


రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే



‘మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..ఆదుకుంటా. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా. అధికారులతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తా. ప్రభుత్వంతో మాట్లాడి బోదవాపు బాదితులకు ప్రత్యేక సర్టిఫికెట్లు ఇప్పించి..పింఛన్ అందేలా చూస్తా. ఇప్పటికే ఈ విషయమై అసెంబ్లీలో మాట్లాడా. జిల్లా హౌసింగ్ పీడీతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వెంటనే మంజూరు చేయిస్తా.



ఎన్నెస్పీ అధికారులతో మాట్లాడి సాగర్ రెండో జోన్‌కు కనీసం మార్చి వరకైనా రబీ వరికి నీరివ్వమని కోరుతా. ప్రధాన రోడ్డు నుంచి అతిథిగృహం వరకు సీసీ రోడ్డు మంజూరు చేయిస్తా. గ్రామంలో తాగునీటి కష్టాలు లేకుండా చేస్తా. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తా. మీ సమస్యలన్నింటినీ పరిష్కరించే వరకు నిత్యం శ్రమిస్తా.

 

రాంరెడ్డి వెంకటరెడ్డి : అమ్మా బాగున్నారా...? మీ గ్రామంలో సమస్యలేంటో చెప్పమ్మా..?

కంచర్ల కళావతి : బాగున్నామయ్యా.. మాకు పింఛన్ రావడం లేదయ్యా. ఎన్ని సార్లు దరఖాస్తు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. పింఛన్ ఇప్పించండి సారూ.

రాంరెడ్డి :  ఓ పెద్దాయనా.. బాగున్నావా? పంటలెలా ఉన్నాయి.?

కాంపాటి శేషయ్య : ఏం చెప్పను సారూ.. వానాకాలంలో వేసిన వరి పంటకు దోమపోటు తగిలి సగం కూడా చేతికి రాలేదు. పంటకు చేసిన అప్పులు కూడా తీరేటట్టు లేవు. వేసిన పత్తి కూడా వానల్లేక ఎండిపోయింది. ఇప్పుడు వరి వేద్దామంటే నీళ్లొస్తయో రావో తెలవట్లేదయ్యా.. అప్పులెలా తీర్చాలయ్యా.

 రాంరెడ్డి : ఏం అక్కా? బాగున్నారా...ఏంటీ సమస్య??

 సాలే నక్షత్రమ్మ : ఇళ్ళు కట్టి ఏడాదిన్నర అయ్యింది. ఇంతవరకు ఇళ్ళ బిల్లులు రాలేదయ్యా. అప్పు చేసి ఇళ్ళు కట్టినం. బిల్లు కోసం తిరిగినా ఎవరూ పట్టించుకోవట్లేదయ్యా. మీరైనా ఇప్పించండి సారూ.

 రాంరెడ్డి : నీ సమస్య ఏంటమ్మా?

 బొంకూరి పద్మ : పక్కా ఇళ్ళు లేద య్యా. ఇళ్ళు కట్టుకోవడానికి ఇంటి కో సం ఎన్ని సార్లు దరఖాస్తు చేసినా ఇళ్ళు మంజూరు కావడం లేదు. గవర్నమెంట్ ఇళ్ళు ఇప్పించండి సారూ.

 రాంరెడ్డి :  ఏం బాబు.. ఆరోగ్యం ఎలా ఉంది?

 గోపి : ఏమి లేదు సార్. మూడు చక్రాల బండి కోసం అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఎవరూ పట్టించుకోవడంలేదు సార్. వికలాంగుడిని.. నడవలేను. మూడు చక్రాల బండి ఇప్పించండి సార్.

 రాంరెడ్డి :  ఏమ్మా.. వికలాంగుల పింఛన్ వస్తుందా?

 రావుల శోభమ్మ : నేను బోదకాలు వ్యాధితో బాధపడుతున్నానయ్యా. ఏ పనికి వెళ్ళలేకపోతున్నా. వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసినా అధికారులు సర్టిఫికెట్ తెమ్మంటున్నారు. హస్పిటల్‌కు వెళ్తే బోదవాపుకు వికలాంగుల సర్టిఫికెట్ ఇవ్వమంటున్నారు. మీరైనా పింఛన్ ఇప్పించడయ్యా.

  రాంరెడ్డి : కాలనీలో మంచినీళ్ళు వస్తున్నాయా?

 సింగం శంకర్ : మంచినీళ్లు రావట్లేదు సార్. పక్కనే పాలేరు ఉన్నా నీళ్లు దొరకడం లేదు. బోరింగులు పని చేయడం లేదు. ఊళ్ళోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నాం.

 రాంరెడ్డి : అంగన్‌వాడీ సెంటర్ నడుస్తుందామ్మా?

 దేశోజు నాగమ్మ : కాలనీలో అంగన్‌వాడీ సెంటర్ లేదయ్యా. పిల్లలకు ఇబ్బంది అవుతోంది. కాలనీలో పొద్దున లేస్తే అందరూ పనికి పోయే వాళ్ళే. పిల్లలను గ్రామ నడిబొడ్డున అరకిలోమీటరు దూరంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి పంపుతున్నం.

 రాంరెడ్డి : చేపల వేట ఎలా ఉంది? లాభాలు వస్తున్నాయా?

 బయ్య వీరస్వామి : చేపల వేట అంతగా బాగలేదు సారూ. గిట్టుబాటు కావడం లేదు. పొద్దస్తమానం తెప్పలు వేసుకొని తిరిగినా రోజుకు వంద రూపాయలూ రావట్లేదు.

 రాంరెడ్డి : ఏం బాబూ..మీ వాడలో సమస్యలేంటి?

 రావుల కాంతారావు : ప్రధాన రహదారి నుంచి బెస్తకాలనీ వరకు సీసీ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నం సారు. వర్షాకాలమైతే మోకాల లోతు నీళ్ళు ఆగుతున్నాయి. సీసీ రోడ్డు మంజూరు చేయించండి సారు.

 రాంరెడ్డి : ఏమండి ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తుందా?

 కొవ్వూరి శ్యాంసుందర్‌రెడ్డి : ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో పండించిన పంటను దళారులకు అమ్ముకుంటున్నాం సార్. వారి ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించండి సార్.

 రాంరెడ్డి : ఏమ్మా.. హోటల్ ఎలా సాగుతోంది? పిల్లలు బడికి పోతున్నారా?

 కాసాని అన్నపూర్ణమ్మ : ధరలు పెరిగినయి సారు.  పెట్టుబడి పెట్టినా ఖర్చులు కూడా రావట్లేదు. పిల్లలను బడికి పంపాలంటే డబ్బులు సరిపోవడం లేదు. డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నా. ఏడాది కాలంగా బ్యాంకుల నుంచి రుణాలు రావట్లేదు.

 రాంరెడ్డి : ఏమ్మా కొట్టు ఎలా ఉంది? గిట్టుబాటు అవుతుందా?

 కాసాని శాంతమ్మ : నా భర్త గత మూడేళ్ళ క్రితం కరెంట్ షాక్‌తో చనిపోయాడు సారు. ఆపద్బంధు పథకం కోసం దరఖాస్తు చేశా. ఇంతవరకు  ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. పెట్టుబడి లేక కొట్టు కూడా నడపలేక పోతున్నా. పూట గడవడమే కష్టంగా ఉంది సార్. ఆపద్బంధు పథకం కింద ప్రభుత్వం నుంచి సాయం అందించండి సారు.

 రాంరెడ్డి : ఏం సర్పంచ్‌గారు గ్రామంలో అభివృద్ధి పనులెలా సాగుతున్నాయి?

 దేవర అమల : సార్ గ్రామంలో కొన్ని వీధుల్లో సీసీరోడ్లు లేవు. మెయిన్ రోడ్డు నుంచి ఎన్నెస్పీ అతిథిగృహం వరకు సీసీ రోడ్లు లేవు. బెస్తకాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సెంటర్లలో మంచినీళ్లు రావడం లేదు. కాలనీలో అగన్‌వాడీ కేంద్రం లేదు. అర్హులైన వితంతువులు, వృద్ధులున్నా పింఛన్ మంజూరు కావడం లేదు సార్.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top