సమష్టి కృషితోనే 109 శాతం ఉత్పత్తి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలోని కార్మికులు, అధికారుల సమష్టి కృషితోనే మే నెలలో 109 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ రవిశంకర్ అన్నారు. గోలేటి టౌన్షిప్లోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లి ఏరియా మే నెలలో 5,90,000 టన్నుల లక్ష్య సాధనకు గాను 6,45,355 టన్నులు సాధించినట్లు తెలిపారు. గతేడాదితో పాల్చితే ఈ ఏడాది ఉత్పత్తితో వృద్ధి సాధించామన్నారు. రానున్న నెలల్లోనూ ఇదే తోడ్పాటు అందించాలన్నారు. డోర్లి–1లో బంక ర్ మరమ్మతు, ఓబీ కాంట్రాక్టు అప్పగింత పనులతో ఉత్పత్తి కొంత తగ్గిందన్నారు.
ఈ నెలలో బీపీఏ–ఓసీ 2 విస్తరణ కోసం భూసేకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. డోర్లి–1 జీవితాకాలం సైతం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా గోలే టి డిస్పెన్సరీని విస్తరించడంతో పాటు గోలేటి నుంచి గోలేటి ఎక్స్రోడ్ వరకు రోడ్డు విస్తరణ కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. గత నెలలో ఏరియా నుంచి 107 ర్యాకుల బొగ్గును రవాణా చేసి రికార్డు సాధించామన్నారు. సమావేశంలో ఎస్వోటూ జీఎం కొండయ్య, డీజీఎం పర్సనల్ చిత్తరంజన్కుమార్, డీవైపీఎం రాజేశ్వర్, ఐఈడీ యోహన్ పాల్గొన్నారు.