'హైకమాండ్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా'
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు కావాలంటూ అడ్వొకేట్లు ఉద్యమిస్తున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడంలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో పొన్నం మాట్లాడుతూ... హైకోర్టు విభజన విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. హైకోర్టు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కేసీఆర్కు హితవు పలికారు. హైకోర్టు విషయంలో బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.
విభజనపై ఒత్తిడి పెంచకుంటే... గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడిస్తామని హెచ్చరించాలని పొన్నం తెలంగాణ అడ్వొకేట్లకు సూచించారు. బుధవారం చలో సెక్రటేరియట్ పోరాటాన్ని చేపట్టిన అడ్వొకేట్లు... టీఆర్ఎస్,బీజేపీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని హితవు పలికారు. అప్పుడే ఆ రెండు పార్టీలు తెలంగాణకు హైకోర్టు విషయంలో దిగొస్తాయని తెలిపారు.
మోదీ కేబినెట్లో టీఆర్ఎస్ చేరాలనుకుంటోంది కాబట్టే.... బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించడం లేదని పొన్నం వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీపీసీసీ చీఫ్గా నియమిస్తూ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని పొన్నం స్పష్టం చేశారు.