అమర వీరులను అవహేళన చేయడమే: పొన్నాల
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అమర వీరుల సంఖ్యపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అమరులుగా 462 మందిని ప్రకటించడం, మిగితావారిని అవహేళనకు గురిచేయడమే అని పొన్నాల అన్నారు. 1969 ఉద్యమం నుంచి పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి పొన్నాల సూచించారు. అమర వీరులు సంఖ్యను 2009 నుంచి మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం తప్పని ఆయన అన్నారు.
రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బ్యాంకులు మాత్రం రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు. రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ పూర్తవడంతో పంట భీమా పథకం వర్తించదన్నారు. దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.