వేడెక్కిన రాజకీయం

వేడెక్కిన రాజకీయం - Sakshi


కాంగ్రెస్‌లో మళ్లీ చర్చనీయాంశమైన వలసలు

     వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం

     టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పోటాపోటీ

     సభ్యత్వ నమోదుకు తెలుగుతమ్ముళ్ల ప్రత్యేక ఆఫర్లు

 

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అన్ని రాజకీయ పార్టీలు వివిధ కార్యకలాపాలలో నిమగ్నం కావ డం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సమయం దగ్గరపడుతుండడంతో ఒక్కసారిగా రాజకీయాలు రస వత్తరంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మళ్లీ వలసలుఉంటాయన్న ప్రచారం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు టీఆర్‌ఎస్‌లోనూ రాజకీయ సమీకరణలకు తావిస్తుండగా, టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ప్రతిష్టాత్మకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్, టీడీలు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్నా, అవి నామమాత్రంగానే సాగుతున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలో సమన్వయలేమి కారణంగా అక్కడక్కడా తూతూమంత్రంగా సభ్యత్వ నమోదు సాగుతోంది. టీడీపీలోనూ అదే పరిస్థితి ఉండగా, తమ సభ్యత్వాల సంఖ్యను వీలున్నంత ఎక్కువ చూపించేందుకు గాను ఆ పార్టీ ప్రమాద బీమా లాంటి ఆఫర్లు ఇస్తూ ముందుకెళుతోంది. వాతావరణంలో చలి తీవ్రత పెరుగుతున్నట్టుగానే రాజకీయాల్లో కూడా అదేస్థాయిలో వేడి పుడుతోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

 

 జంపింగ్.. జపాంగ్

 రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయి. ఇదే క్రమంలో జిల్లా వ్యాప్తగా 1100 మందికిపైగా ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే యోచనలో ఉన్నట్టు గతంలోనే వార్తలు వినిపించినా, ఇటీవల సీఎం ను కలవడంతో ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, నాయక్ మాత్రం ఎక్కడా తన అంతరంగాన్ని వెల్లడిం చడం లేదు. జెడ్పీచైర్మన్‌గా సీఎంను కలవడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్న ఆయన.. టీఆర్‌ఎస్‌లో చేరే అంశాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం. అయితే, టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ నేతల వలసల అంశం ఈ రెండు పార్టీల్లో కూడా వేడిపుట్టిస్తోంది. ఇటీవలి పరిణామాలపై వస్తున్న వార్తలే నిజమైతే జిల్లా పార్టీలో ఆధిపత్యపోరుకు తెరలేస్తుందనేది ఓ వర్గం వాదన. ఈ పరిస్థితుల్లో మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న వారిని కాకుండా కొత్తగా వస్తున్న వారిని పార్టీ అధినాయకత్వం పరిగణనలోనికి తీసుకుంటుందా అనే ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతోంది.

 

 నూతనోత్సాహంతో వైఎస్సార్‌సీపీ

 ఇక, వైఎస్సార్‌సీపీ కూడా ఎన్నికల అనంతరం మళ్లీ క్రియాశీలమవుతోంది. ఇటీవల జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించుకున్న ఆ పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశానికి హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు ఈ మేరకు దశానిర్దేశం చే శారు. అయితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల త్వరలోనే తెలంగాణలో ఓదార్పు యాత్ర నిర్వహించి తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని కలుస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. దీంతో ఆమె రాక కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.

 

 నువ్వా... నేనా.. సై

 మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వ్యవహారం కూడా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు ఈస్థానంపై తమ వ్యూహాలకు పదును పెడుతుండగా, టీఆర్‌ఎస్‌లో మాత్రం అభ్యర్థిత్వం విషయంలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల నియోజకవర్గం కావడంతో ఆ రెండు జిల్లాలతో పాటు మన జిల్లా నుంచి ఆశావహులు సీటు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి టికెట్ రేసులో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి ముందుండగా, సీనియర్ నాయకుడు చాడా కిషన్‌రెడ్డి కూడా తనకు పార్టీ అధినేత ఆశీస్సులుంటాయని భావిస్తున్నారు. గతంలో ఎంపీగా పోటీచేసిన రాజేశ్వర్‌రెడ్డి ఇంకా రేసులోనే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కాగా, జర్నలిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం.   మరోవైపు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పందిరి వెంకటేశ్వర మూర్తికి టికెట్ ఇవ్వాలని ఉద్యోగ వర్గాలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం జిల్లాలో పెద్ద ఎత్తున పోటీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది.

 

 సా... గుతున్న సభ్యత్వాలు

 కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సభ్యత్వ నమోదులో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు మొక్కుబడిగానే సాగుతోంది. ఏఐసీసీ నాయకులు వచ్చినా జిల్లా నాయకులంతా ఒకే వేదికపై కనిపించే సమన్వయం లేకపోవడం, జిల్లాలో సభ్యత్వ నమోదును ముందుండి నడిపించాల్సిన పార్టీ జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి  కొంతకాలంగా స్తబ్దుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎవరికి వారే అన్నరీతిలో కాంగ్రెస్ సభ్యత్వాలు జరుగుతున్నాయి. ఇక, తెలంగాణలో నానాటికీ బలహీనపడుతోన్న తెలుగుదేశం పార్టీ కూడా సభ్యత్వ నమోదును ప్రారంభించింది. జిల్లాలో పార్టీకి దిక్సూచిగా ఉండే నాయకులు లేకపోవడం, ఉన్న నలుగురు నేతల మధ్య సమన్వయం లేకపోవడం, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన నేతలు నియోజకవర్గాలకు మొహం చూపించకపోవడంతో ఆ పార్టీలో సభ్యులను చేర్చేందుకు తెలుగుతమ్ముళ్లు నానా తంటాలు పడుతున్నారు.

 

 ఇక, ఆ పార్టీ ఈసారి సభ్యత్వ న మోదులో విన్నూత్న రీతిలో ముందుకెళుతోంది. తమ పార్టీలో చేరితే పార్టీ సభ్యత్వంతో పాటు రూ.2లక్షల ప్రమాదబీమా కల్పిస్తామని, ప్రయాణాల్లో రాయితీలు కల్పిస్తామని ఆఫర్లు ఇస్తోంది. అయినా, సభ్యత్వ నమోదు మందకొడిగా సాగుతుండడం గమనార్హం. భారతీయ జనతా పార్టీ  కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ శాసనసభా పక్ష నేత డాక్టర్. కె.లక్ష్మణ్  జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించగా, కార్యకర్తలంతా ఆ పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే నెలలో జరగనున్న జిల్లా మహాసభలకు సీపీఎం సిద్ధమవుతోంది. కాగా, సీపీఐ శ్రేణులు కూడా త్వరలోనే పార్టీ మహాసభలు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతువున్నాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top