చెరువులో విష ప్రయోగం
60వేలకు పైగా చేపలు మృత్యువాత
సుమారు రూ.15 లక్షల నష్టం
గద్వాల టౌన్ : ఓ చెరువులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగానికి తెగబడటంతో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. వివరాలిలా ఉన్నాయి. గద్వాల పట్టణానికి చెందిన లక్ష్మణ్ , దౌలన్న చెనుగోనిపల్లి శివారులోని పెద్దచెరువును లీజుకు తీసుకుని చేపలను పెంచుతున్నారు. ఇటీవల చెన్నకేశవ మత్స్యకార సహకార సంఘం ద్వారా నిర్వహించిన వేలంలో ఈ చెరువును వారు దక్కించుకున్నారు. నెలరోజుల క్రితం లక్షన్నర చేపపిల్లలను ఈ చెరువులో వదిలారు. అయితే శనివారం అర్ధరాత్రి కొందరు దుండగులు అందులో విష ప్రయోగానికి పాల్పడ్డారు.
ఆది వారం ఉదయం లీజుదారులు అక్కడికి వెళ్లి చూడగా పెద్ద ఎత్తున చేపలు మృతి చెంది పైకి తేలడంతో పోలీసులతో పాటు మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి వారు చేరుకుని పుట్టీ ద్వారా గాలించి 60వేలకు పైగా చేపలు మృతి చెందినట్లు లెక్కగట్టారు. వీటి విలువ సుమారు *15 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. చ ఈ మేరకు ఎస్ఐ గడ్డంకాశీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం విలేకరులతో బాధితులు మాట్లాడుతూ రాజకీయకక్షల కారణంగానే కొందరు వ్యక్తులు చెరువులో విషప్రయోగం చేశారని ఆరోపించారు. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇలాంటి పనికి తెగబడ్డారన్నారు.