ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
నల్లగొండ టుటౌన్ :మన పట్టణం, మన వార్డు, మన ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై ప్రణాళికా బద్ధంగా వార్డులను అభివృద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీ వులు అన్నారు. ఆదివారం పట్టణంలోని 3వ వార్డు పద్మనగర్లో జరిగిన మన వార్డు మన ప్రణాళిక సభలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. మనకు ఏది అవసరమో దానినే తయారు చేసుకోవడానికే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. మన వద్ద ఉన్న వనరులను గర్తించడంతో పాటు జీవనోత్పత్తి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేయడం వల్ల అభివృద్ధి సాదించవచ్చన్నారు.
వ్యక్తిగత సమస్యల కంటే తమ ప్రాంతాలలో సామూహిక సమస్యలు గర్తించి వాటికి ఎక్కువగా ప్రధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి వార్డులో మూడు ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించుకుంటే ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. దీని ద్వారా అనవసర ఖర్చులు కూడా తగ్గితాయని పేర్కొన్నారు. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, తాగు నీరు, సీజ నల్ వ్యాధులను ప్రణాళికలో చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, కమిషనర్ జి. వేణుగోపాల్రెడ్డి, ఈఈ రాజయ్య, 3వ వార్డు కౌన్సిలర్ మిర్యాల యాదగిరి, బీజేపీ కౌన్సిలర్లు బొజ్జ నాగరాజు, మొరిశెట్టి నాగేశ్వర్రావు, మెప్మా సీఓ జ్యోతి, బిల్ కలెక్టర్ యాదయ్య, గుర్రం వెంకన్న పాల్గొన్నారు.