ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
సంగారెడ్డి క్రైం: ఓ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లా కేంద్రమైన సంగా రెడ్డిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం పట్టణానికి చెందిన రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతుల కూతురు శిరీష (22) సంగారెడ్డి శివారులోని ఎంఎన్ఆర్ కళాశాలలో ఫార్మసీ ఐదో సంవత్సరం చదువుతోంది. స్థానిక వీరభద్రనగర్ కాలనీ లో ఓ గదిని ముగ్గురు స్నేహితులతో కలసి అద్దెకు తీసుకుంది. ప్రస్తుతం కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారం ఆమె స్నేహితులు కాలేజీకి వెళ్లగా శిరీష మాత్రం గదిలోనే ఉండిపోయింది. పరీక్ష ముగిసిన అనంతరం తిరిగి వచ్చిన స్నేహితులు గది తలుపు తట్టారు. ఎంతకీ తలుపు తెరవలేదు. ఇరుగుపొరుగు సహా యంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిచూడగా శిరీష ఫ్యాన్కు ఉరేసుకొని కన్పించింది.
గదిలో సూసైడ్ నోట్
‘అమ్మానాన్న.. నన్ను క్షమించండి’ అంటూ శిరీష రాసిన సూసైడ్ నోటు గదిలో లభించింది. ‘ నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ అశలను నేరవేర్చలేకపోతున్నా నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా స్నేహితులు సైతం నన్ను బాగా చూసుకున్నారు. వాళ్లు కూడా నన్ను క్షమించాలి’ అని ఆమె ఆ నోట్లో పేర్కొంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.