గ్రూప్–1 పోస్టుల భర్తీపై పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్లో అన్ని పేపర్లు రాయలేదన్న కారణంతో తనను టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూలకు అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ కార్తీక్రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు గురువారం కొట్టేసింది. మెయిన్స్లో అన్ని పేపర్లు రాసి, ఇంటర్వ్యూలకు హాజరైన వారే గ్రూప్–1 పోస్టుల భర్తీకి అర్హులని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలంటూ టీఎస్పీఎస్సీ స్టాండింగ్ కౌన్సిల్ బాలకిషన్రావు వాదించారు.
కార్తీక్రెడ్డి పిటిషన్ను కొట్టేయ డమే కాకుండా, అతడిని ఇంటర్వ్యూలకు అనుమతిస్తూ ఓ పోస్టును ఖాళీగా ఉంచాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ ఉత్తర్వులు జారీ చేశారు. మెయిన్స్లో అన్ని పేపర్లు రాయనందుకు కార్తీక్రెడ్డిని టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూలకు అనుమతించలేదు. దీంతో గతంలో పిటిషన్ దాఖలు చేయగా, ఇంటర్వ్యూలకు అనుమతించడంతో పాటు ఓ పోస్టును ఖాళీగా ఉంచాలని ఈ ఏడాది జూలైలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.