విద్యుత్‌ తీగలు పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య


భార్యతో గొడవపడి మనస్తాపం

 

మొయినాబాద్‌ (చేవెళ్ల):  భార్యతో గొడవపడి ఓ వ్యక్తి విద్యుత్‌ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా  శంకర్‌పల్లి మండలం గోపులారం గ్రామానికి చెందిన పొడుగు మహేశ్‌(26), సుజాత దంపతులు. రెండు రోజుల క్రితం సుజాత మొయినాబాద్‌ మండలం మేడిపల్లిలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి మహేశ్‌ కూడా అక్కడి వచ్చాడు. రాత్రి భార్యాభర్తలిద్దరు గొడవపడ్డారు. ఇంతలో మహేశ్‌ ఆత్మహత్య చేసుకుంటానంటూ విద్యుత్‌ స్తంభంపైకి ఎక్కి దాదాపు 20 నిమిషాలపాటు ఉన్నాడు. స్తంభంపై నుంచే తన తల్లికి ఫోన్‌ చేసి కరెంటు తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. మేడిపల్లి నుంచి గోపులారం వెళ్తున్న మహేశ్‌ తల్లి వెంటనే తిరిగి మేడిపల్లికి వచ్చింది. విద్యుత్‌ స్తంభంపై నుంచి కిందకు దిగాలని బతిమాలింది. అయినా వినకుండా మహేశ్‌ విద్యుత్‌ తీగలను పట్టుకున్నాడు. షాక్‌ తగిలి కిందపడి మృతి చెందాడు. 

 

విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యం: మహేశ్‌ స్తంభంపైనే ఉండడంతో గ్రామస్తులు విద్యుత్‌ ఏఈకి ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని కోరగా లైన్‌మన్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. లైన్‌మన్‌కు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. వెంటనే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు ఫోన్‌ చేయగా లైన్‌మన్‌గాని, పైఅధికారులుగాని చెబితేనే సరఫరా నిలిపివేస్తామని సబ్‌స్టేషన్‌ సిబ్బం ది సమాధానమిచ్చారు. ఇంతలో మహేశ్‌ విద్యుత్‌ తీగలను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యుత్‌ అధికారులు స్పందించి ఉంటే మహేశ్‌ ప్రాణాలు పోయేవి కావని, వారి నిర్లక్ష్యం వల్లే అతడు మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top