జాప్యంతో రూ. కోట్లు వృథా

జాప్యంతో రూ. కోట్లు వృథా - Sakshi


 మక్తల్ : ప్రభుత్వాల వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతుందని తద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ అన్నారు. ప్రాజెక్టుల కింద ముంపునకు గురైన ప్రాంతాల్లో నిర్వాసితులకు అన్నివసతులతో పునరావాసం కల్పించాలన్నారు.  బుధవారం ఆయన సంగం బండ, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంలో  ప్రభుత్వాలు నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తున్నాయని, దశాబ్దాలు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదన్నారు. జిల్లాలోనిసంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు శంఖుస్థాపన చేసి 19 ఏళ్లు గడచినా ప్పటికీ పూర్తి కాకపోవడం దారుణమన్నారు. దీని వల్ల   ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మూడురెట్లు పెరిగిందన్నారు. పాలమూరు జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారన్నారు. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం పూర్తరుుతే జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ ఖరీఫ్ సీజన్‌లోనే రైతులకు సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

 

 అక్రమాలపై విచారణ జరిపించాలి

 ముంపు గ్రామాల్లో అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని  నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరడిగొమ్ము, భూత్పూర్ గ్రామాల్లో కొందరు అక్రమంగా షెడ్లు నిర్మించుకుని పరిహారం స్వాహా చేస్తున్నారన్నారు. ఇందులో అధికారులకు వాటా ఉందని ఆరోపించారు. నిజమైన లబ్దిదారులు ఏళ్లతరబడి పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పునారవాస కేంద్రాల్లో కూడా రూ.3లక్షలతో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనెఉన్నట్లు తెలిపారు.

 

 జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల పరిశీలన

 ధరూరు : సీపీఐ బృదం బుధవారం సాయంత్రం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ రిజర్వాయర్‌ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. నీటి నిల్వ, ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూరాల- పాకాలకు ఇచ్చే నీటి వివరాలను ఈఈ రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు.

 

 కొత్తగా నిర్మించనున్న ప్రాజెక్టు మార్గదర్శకాలు తమ వద్ద లేవని, లెఫ్ట్ కెనాల్ ప్రాంతం నుంచి నీళ్లు వదిలే ప్రాంతాన్ని  అధికారులు ఆయనకు చూపారు. అనంతరం నెట్టెంపాడు నెట్టెంపాడు ఎత్తిపోతల పనులను పరిశీలించారు. ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్లు, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు గద్వాలకు బయలుదేరి వెళ్లారు. ఈ బృందంలో సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లు వెంకటేష్, వర్ల పద్మ, విశ్వేరరావు, జిల్లా నాయకులు ఈర్ల నరసింహ, ఆంజనేయులు, కేశవులు తదితరులు న్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top