ప్రాణం తీసిన ‘మిస్డ్‌కాల్’

ప్రాణం తీసిన ‘మిస్డ్‌కాల్’


కుత్బుల్లాపూర్: ఓ మిస్డ్ కాల్ అనుమానం రేపింది.. మహిళ మృతికి కారణమైంది.. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ప్రవీందర్‌రావు, బాధితులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం, ఎనగర్తి గ్రామానికి చెందిన కనకవ్వ(30)కు అదే మండలం ఆకారం గ్రామానికి చెందిన నర్సింహ(36)తో 2005లో వివాహం జరిగింది. ఎనిమిదేళ్ల పాటు స్వగ్రామంలోనే ఉన్న వీరు కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మండలం, గుండ్లపోచంపల్లికి వచ్చి నివాసముంటున్నారు.



కనకవ్వ స్థానికంగా సీడ్స్ కంపెనీలో పనికి వెళ్తుండగా, నర్సింహ కారు డ్రైవర్.  వీరికి నవ్వ(8) కుమార్తె ఉంది. భార్యపై అనుమానంతో నర్సింహ తరచు గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి  మద్యం సేవించి  ఇంటికి వచ్చాడు. ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు కనకవ్వ సెల్‌ఫోన్‌కు మిస్డ్ కాల్ వచ్చింది. దీంతో నర్సింహ ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవడు చేశాడంటూ ఆమెను చితకబాదాడు. పక్కనే ఉంటున్న అత్తగారి ఇంటికి తరిమి కొట్టాడు.



కనకవ్వ సృ్పహ కోల్పోయింది. పేట్ బషీరాబాద్ ఆర్‌ఆర్ ఆస్పత్రికి తరలించగా తలకు తీవ్ర గాయాలు కావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సింహను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో వచ్చిన మిస్డ్ కాల్ నంబరు విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top