‘పాలమూరు’పై రేపు సభలో సీఎం ప్రకటన!
-
తొలి దశ పనుల ప్రారంభ తేదీలను వెల్లడించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం శాసనసభలో ప్రకటన చేయనున్నారు. ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రాజెక్టు తొలిదశ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రభు త్వం సంకల్పిస్తున్న దృష్ట్యా, దీనిపై శాసనసభా వేదికగా ప్రకటన చేసి తర్వాతి కార్యాచరణపై ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవలే ప్రాజెక్టు తొలిదశ పనుల సమగ్ర నివేదిక(డీపీఆర్) ప్రభుత్వానికి చేరిన అంశాన్ని ప్రస్తావిస్తూ, సీఎం ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని సభ దృష్టికి తెస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం ద్వారా మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని సుమారు 10లక్షల ఎకరాలకు సాగు నీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.