వివస్త్రను చేసి..నోట్లో యాసిడ్ పోసి..
- చనిపోయిందని భావించి మహిళను నీటిగుంతలో పడేసిన వైనం
- చికిత్స పొందుతూ మృతి
వర్గల్ (గజ్వేల్): ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. నోట్లో యాసిడ్ పోసి.. వివస్త్రను చేశారు. చనిపోయిందని భావించి నిర్జన ప్రదేశంలోని రోడ్డు పక్కన బురద గుంటలో పడేశారు. సుమారు 12 గంటలపాటు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ స్థానికుల దృష్టిలో పడిన ఆ మహిళ చివరకు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి శివారులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
మర్కూక్ మండలం పాములపర్తి శివారులో సింగాయపల్లి అటవీ క్షేత్రం సమీపాన రోడ్డు పక్కన బురద నీటిలో సోమవారం మధ్యాహ్నం గొర్రెల కాపరులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మహిళను గమనించారు. పోలీసులు వచ్చి ఆమెకు సపర్యలు చేసి,వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. తన పేరు ఇట్టుపల్లి కవిత అని.. తమది యాదాద్రి జిల్లా ఆలేరు గ్రామం పోచమ్మబస్తీ అని, భర్త రాములు మేడ్చల్లోని చాక్లెట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డు అని వివరించింది. కొమురవెల్లికి వచ్చామని, భర్త రాములు తనను కొట్టాడని, వెంట రేణుక అనే మరో మహిళ ఉందని, భర్త ఫోన్ నంబరు చెప్పింది. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉండటాన్ని బట్టి యాసిడ్ పోసినట్టు తెలుస్తోంది.నోటిలో యాసిడ్ పోయడంతో సరిగ్గా మాట్లాడలేక పోవడంతో పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. భర్తపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.