శీలానికి వెల కట్టిన గ్రామ పెద్దలు

శీలానికి వెల కట్టిన గ్రామ పెద్దలు


- పెళ్లికి నిరాకరించిన మోసగాడు

- రూ.40వేలు పరిహారం ఇవ్వాలని పెద్దల తీర్పు

- అబార్షన్‌ చేయించిన తల్లిదండ్రులు

- అనారోగ్యంతో రెండు నెలల తరువాత మృతి

- 12 మందిపై కేసు




కల్లూరురూరల్‌(సత్తుపల్లి): ఖమ్మం జిల్లాలోని ఓ గిరిజన వికలాంగ బాలికను గర్భవతిని చేసి, పెళ్లికి నిరాకరించిన మోసగాడిని ఆ గ్రామ పెద్దలు వదిలేశారు. బదులుగా, ఆమె శీలానికి వెల (నష్ట పరిహారం) నిర్ణయించారు. ఆమెకు తల్లిదండ్రులు అబార్షన్‌ చేయించారు. రెండు నెలల తరువాత ఆమె మృతిచెందింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజర గ్రామానికి చెందిన వికలాంగురాలు వాంకుడోత్‌ రాణి(15)కి, అదే గ్రామానికి చెందిన మూడు చెన్న కేశవులు మాయ మాటలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. కొన్నాళ్ల తరువాత ఆమె గర్భందాల్చింది. ఆమె తల్లిదండ్రులు గ్రామ పెద్దల ద్వారా పంచాయతీ పెట్టించారు. రాణిని చెన్నకేశవులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. దీనికి అతడి తల్లిదండ్రులు నిరాకరించి, నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధపడ్డారు. బాలిక కుటుంబానికి రూ.40వేలు చెల్లించేలా ఇరు కుటుంబాల మధ్య గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు.



అబార్షన్‌.. మృతి

బాలికను మోసగాడైన చెన్నకేశవుల తల్లి మూడు లచ్చి, ఖమ్మం తీసుకెళ్లి అబార్షన్‌ చేయించింది. నిరుపేదలైన బాలిక తల్లిదండ్రులు వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోలేదు. ఆమె ఆరోగ్యం క్షీణించి, ఖమ్మం ఆస్పత్రిలో మృతిచెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో 12మందిపై కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్‌ కేసు నమోదు చేశారు. అబార్షన్‌ చేసిన ఆసుపత్రి వైద్యులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top