ఆత్మస్థైర్యం ముందు ఓడిన వైకల్యం
భువనగిరి: ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. 600 అడుగుల ఎత్తున్న భువనగిరి ఖిల్లాను ఓ వికలాంగుడు అవలీలగా ఎక్కాడు. హైదరాబాద్కు చెందిన ఢిల్లీ మెహతాకు తొమ్మిదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు విరిగిపోయింది. కృత్రిమ అవయవాన్ని అమర్చుకున్నాడు. ఏదో సాహస కార్యక్రమాలకు ఒడిగట్టే మెహతా.. భువనగిరి ఖిల్లా ఎక్కాలనుకున్నాడు.
అంగవైకల్యం ఉన్నా ఆదివారం మధ్యాహ్నం ఖిల్లా ఎక్కి ఔరా అనిపించాడు. మెహతా ఇప్పటివరకు కాశ్మీర్ నుంచి కన్యకుమారి వరకు 32 రోజుల్లో 3,800 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణం చేశాడు. అలాగే దేశ వ్యాప్తంగా 38 వేల కిలోమీటర్ల దూరం రెండు సంవత్సరాల కాలంలో ప్రయాణంచేసి నాలుగుసార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా సైక్లింగ్ చేయడం లక్ష్యమని మోహత ‘సాక్షి’కి తెలిపాడు.