17న జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుల ఎన్నికలను డిసెంబర్ 17న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును కూడా ఉత్తర్వుల్లో పొందుపర్చారు. జిల్లా ప్రణాళిక కమిటీల్లోనూ 30 మంది సభ్యులుంటారు.
ఇందులో సభ్యులుగా ఉంటూనే.. కమిటీ చైర్మన్గా జిల్లా పరిషత్ చైర్మన్, మెంబర్ కన్వీనర్గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. నలుగురు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగిలిన 24 మంది సభ్యులను ఆ జిల్లాల్లోని జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నుకుంటారు. ప్రభుత్వం ప్రకటిం చిన ఎన్నికల షెడ్యూలు ప్రకారం.. వచ్చేనెల 8న ఎన్నికల నోటీసును ఎన్నికల అధికారి ప్రకటిస్తారు.
అదేరోజు ఓటర్ల జాబితాలను విడుదల చేస్తారు. 10వరకు అభ్యంతరాలను స్వీకరించి, 11న తుది జాబితా ప్రకటిస్తారు. 12 నుంచి నామినేషన్ల స్వీకరణ, 15న పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 16వరకు గడువిచ్చారు. 17న ఎన్నికలు నిర్వహించి అదేరోజు లెక్కింపు అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.