మార్చి 3న చంద్రబాబుకు పోటీ సభ
18న ఇరు రాష్ట్రాల అసెంబ్లీల ముట్టడి
ఎమ్మెస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
హన్మకొండ చౌరస్తా : ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని అసెం బ్లీలో ఆమోదించి పెద్ద మాదిగను అవుతానని ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు అలా చేయకుండా మాది గ ద్రోహిగా మిగిలారని ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. హన్మకొండ నయూంనగర్లో మాదిగ లాయర్ల ఫెడరేషన్(ఎంఎల్ఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 3వ తేదీన కరీంనగర్లో నిర్వహించే సభకు రావడానికి ముందే చంద్రబాబునాయుడు వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో ఆయన సభకు పోటీగా తాము సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇక గతంలో మూడు సార్లు ప్రధాన మంత్రిని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు కేసీఆర్ సైతం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో మార్చి 18న ఇరు రాష్ట్రాల అసెంబ్లీను ముట్టడిస్తామని మంద కృష్ణ తెలిపారు. గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న డాక్టర్ టి.రాజయ్య కేసీఆర్ను ఒప్పించి వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టించారని, ఇప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లేలా కేసీఆర్పై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కాగా, లాయర్ల జాతీయ మహాసభలు మార్చి 23న నిర్వహించనున్నామని, ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని మంద కృష్ణ తెలిపారు. సమావేశంలో ఎంఎల్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు బైరపాక జయాకర్తో పాటు రత్నం, మధుకర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.