సీఎం హామీల పరిస్థితేంటి...
నేడు ఉప ముఖ్యమంత్రి కడియం సమీక్ష
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీహరి
వరంగల్ : అనూహ్య పరిణామాలతో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కడియం శ్రీహరి శనివారం జిల్లాలో పథకాల అమలు, అభివృద్ధి అంశాలపై తొలి సమీక్ష నిర్వహించనున్నారు. కడియం శ్రీహరి శుక్రవారం విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శని వారం ఉదయం ఆయన వరంగల్కు వస్తున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించనున్నారు. సీఎం కేసీఆర్ జనవరి 8 నుంచి 11 వరకు వరంగల్ నగర పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపైనే ప్రధానంగా సమీక్ష జరగనుంది. కేసీఆర్ 4 రోజుల పర్యటనలో కడియం శ్రీహరి, 4 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. సీఎం ఈ సందర్భంగా ఎక్కడెక్కడ ఏ హామీలు ఇచ్చారు, వాటి అమలు తీరు ఎలా ఉందనే అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. కేసీఆర్ పర్యటన సమయంలో ఉన్న జిల్లా కలెక్టర్, జేసీ, కార్పొరేషన్ కమిషనర్ బదిలీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి నియమితులయ్యారు. ఈ క్రమంలో కొత్త బృందం వేగంగా పనులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది.
హామీలు ఎక్కడివక్కడే...
రూ.400 కోట్లతో నగరంలోని ఆరు బస్తీల్లో జీ ప్లస్ వన్తో 3954 ఇళ్లు నిర్మిస్తామమని కేసీఆర్ చెప్పారు. అధికారుల తీరుతో ఈ అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. జీ ప్లస్ వన్పై సర్వే ఇంకా పూర్తి కాలేదు. పది రోజుల్లోపే ప్రణాళికలు రూపొందించాలని పర్యటనలో ముఖ్యమంత్రి చెప్పినా... జిల్లా అధికారులు ఈ దిశగా పనులు చేయడం లేదు. తెలంగాణలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ భూముల సమీకరణ ముఖ్య అంశమని కేసీఆర్ చెప్పారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా నగరంలో పార్కులు, కమ్యూనిటీ హాళ్లు మార్కెట్లు వంటి ప్రజా సౌకర్యాలు ఏర్పాటు చేసేం దుకు ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశిం చారు. రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికీ ఈ పని పూర్తి చేయలేదు. రూ.2 వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయని చెబుతున్నా... ఎంత విస్తీర్ణం అనేది చెప్పడంలేదు. ‘వరంగల్ నగర అభివృద్ధికి ప్రధానంగా రహదారులను విస్తరించాలి. ప్రధాన రహదారులను 150 అడుగులకు విస్తరించాలి. ఇలాంటి ప్రధాన రహదారుల్లో సైకిల్ బే, బస్బే, ఫుట్పాత్లు ఉండాలి. స్టాప్ ఫ్రీ, సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు వచ్చేలా ఫై ్ల ఓవర్లు నిర్మించాలనే ప్రణాళికలో ఉన్నాం’ అని కేసీఆర్ అన్నారు. దీనికి అధికారులు చర్యలు తీసుకోవాలి.
సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా ప్రధాన రహదారులను 150 అడుగులకు విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ, నష్టపరిహారం అంచనాలను సిద్ధం చేశారు. భూసేకరణ, భవనాల నష్టపరిహారం కోసం రూ.3 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.ఉపాధి అవకాశాలకు వరంగల్ను రాష్ట్రంలో రెండో కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. దీనికి అనువైన ప్రాంతం ఎంపికకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని బృందం సూరత్, తిర్పూరుకు వెళ్లి వచ్చింది. షోలాపూర్కు వెళ్లాల్సి ఉంది. జిల్లాలో టెక్స్టైల్ పార్కుకు అనువైన ప్రాంతం ఏదనేది మాత్రం ఇప్పటికీ ప్రతిపాదనలు సిద్ధం కాలేదు.