జిల్లాలో వడదెబ్బ మరణాలు లేవు
డీఎంహెచ్ఓ సాంబశివరావు
ఎంజీఎం : జిల్లాలో ఎండల ఉధృతి కారణంగా పూర్తిస్థాయి లో వడదెబ్బతోనే ఎవరూ మృతిచెందినట్లు ధ్రువీకరణ కాలేదని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి బొజబోయిన సాంబశివరావు పేర్కొన్నారు. ప్రజలు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వివరించారు. ఫిబ్రవరి నుంచి మే మొదటి వారం వరకు 66 మంది వడదెబ్బతో మృతిచెంది నట్లు వివిధ ప్రసార సాధనాల ద్వారా తెలిసిందన్నారు. వడదెబ్బ మరణాన్ని ధ్రువీకరించేందుకు మెడికల్ ఆఫీసర్తోపాటు తహసీల్దార్, ఎస్సై పంచనామా చేయూల్సి ఉంటుందని తెలిపారు. ఆ కమిటీ ద్వారా ఇంతవరకు వడదెబ్బగా ధ్రువీకరించిన కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు మే రెండో వారం నుంచి శనివారం వరకు సుమారు 88 మంది వడదెబ్బతో మృతిచెందినట్లు ప్రసార సాధనాల ద్వారా తెలిసిందన్నారు. వాటిపై కూడా ఆయా పీహెచ్సీల పరిధిలో కమిటీలు వడదెబ్బతో జరిగిన మరణాలో కాదో ధ్రువీకరించడం జరుగుతుందన్నారు. వడదెబ్బతో మృతిచెందితే అపద్బాంధు పథకం ద్వారా సాయం అందుతుందన్నారు.
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వదడెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ సాంబశివరావు సూచించారు. నీరు తక్కువగా తీసుకుని, మత్తు పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందన్నారు. ఎండలో విశ్రాం తి లేకుండా ఎక్కువగా పనిచేయడం వల్ల, ఆహారం సరిగా తీసుకకోపోవడం వల్ల వడదెబ్బ బారినపడే ప్రమాదముందన్నారు. ఎండలో తప్పనిసరి వెళ్లాల్సి వస్తే టోపీలు ధరించాలని, నీరు, ద్రవపదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో డీఐఓ రామకృష్ణ, వైద్యులు సారంగపాణి, రామ్మోహన్రావు, స్వరూపరాణి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.