అమెరికాలో బిక్కు బిక్కు

అమెరికాలో బిక్కు బిక్కు - Sakshi


వరుస ఘటనలతో బెంబేలెతుత్తున్న ‘మనోళ్లు’

ఆందోళనలో బాధిత కుటుంబీకులు  

ఫోన్‌లో క్షేమసమాచారం తెలుసుకుంటున్న వైనం




ఆదిలాబాద్‌ : అమెరికాలోని కాన్సర్‌లో బుధవారం హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ను ఆ దేశపౌరుడు జాతి వివక్షతో కాల్పులు జరిపి పొట్టనపెట్టుకున్న సంఘటన ఇక్కడి వారిని కలవర పెడుతోంది. అమెరికాలో మనోళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులతో జిల్లా నుంచి అమెరికాలో ఉంటున్న వారి గురించి ఇక్కడి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలని, బయటకు ఎక్కువగా వెళ్లకుండా చూసుకోవాలని చెబుతున్నారు.



ఫోన్‌లో మాట్లాడి భయందోళనకు గురికావద్దంటూ ధైర్యం చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికైన తర్వాత ఈ దాడులు మరింత పెరిగిపోయాయి. ట్రంప్‌ పాలసీతో భారతీయులకు అమెరికాలో రక్షణ లేకుండా పోతోంది. మత, జాతి, వివక్ష, వలస జీవులపై వ్యతిరేకతతో విద్వేష పూరిత దాడులు జరుగుతున్నాయి. ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ.. వలస జీవులు వెళ్లిపోవాలంటూ దాడులు, కాల్పులకు పాల్పడుతుండడంతో అమెరికాలో భారతీయులు భయంభయంగా ఉంటున్నారు. శ్రీనివాస్‌ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగకుండా అక్కడి అమెరికా ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.



దాడులు అమానుషం..

ఎదులాపురం : అమెరికాలో మా మనవడు, మనవరాలు కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఇటీవల ట్రంప్‌ విధానాలు చూసి భయందోళనకు గురవుతున్నారు. భారతీయుల్లో ప్రతిభ ఉంటేనే అమెరికాలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. అమెరికాలో ఉన్న ఎంతోమంది భారతీ యులు అమెరికా అభివృద్ధికి తో డ్పడుతున్నారు. అలాంటిది జాతి వివక్షతో దాడులు చేస్తున్నా పట్టిం చుకోకపోవడం సరైంది కాదు. అమెరికాలో ప్రతిభావంతులు లేకపోవడంతోనే మన దేశ పౌరులు అక్కడ ప్రతిభ కనబరుస్తున్నారు.

– రాంరెడ్డి, భుక్తాపూర్‌  



గన్‌కల్చర్‌తోనే దాడులు..

మాది ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌ కాలనీ. కొన్నేళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. అమెరికాలో గన్‌కల్చర్‌ ఎక్కువ. అందుకే దాడులు జరుగుతున్నాయి. కొంత మందికి మాత్రమే జాతి వివక్ష ఉంది. ఇప్పటివరకు వారు బయటపడలేదు. ట్రంప్‌ వచ్చిన తర్వాత దాడులకు పాల్పడుతున్నారు. మనదగ్గర గన్స్‌ ఉండవని టార్గెట్‌ చేస్తారు. ఏదైనా గొడవ జరిగితే దూరంగా వెళ్లిపోవడమే మంచిది. కేవలం మన ఆలయాల వద్దే భారతీయులకు కాప్స్‌ (భద్రత సిబ్బంది) ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు అలాంటిదేమీ ఉండదు. ప్రస్తుతం నేను జార్జీయ రాష్ట్రంలో ఉంటున్న. పనిచేసే చోట జాతి వివక్ష వంటివి కనిపించవు. నాతో పనిచేసే సిబ్బంది స్నేహపూర్వకంగానే ఉంటారు. నగరంలో మాత్రమే భద్రతపరమైన ఇబ్బందులుంటాయి. అమెరికన్స్‌ వారి రక్షణ కోసం ప్రతీ ఒక్కరు గన్‌ వాడుతుంటారు. నగరంలో ఏదైనా పని ఉన్నప్పుడు అక్కడ శాంతియుత వాతావరణం చూసుకుంటారు. నిత్యం ఎక్కడో ఒకచోట ఇలా కాల్పులు జరుగుతూనే ఉంటాయి. చిన్నాపెద్ద అంటూ ఎలాంటి తేడా చూ డరు. కాల్పులు జరపడమే పనిగా పెట్టుకుంటారు. మనమే కాస్తా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.                  

– ప్రవీణ్‌కుమార్, అమెరికా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, ఆదిలాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top