కబ్జాపై సభా సంఘం వేయడానికి అభ్యంతరంలేదు: కేసీఆర్

కె.చంద్రశేఖర రావు - Sakshi


హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో అసైన్డ్‌ భూముల ఆక్రమణపై వాడివేడి చర్చ జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలోని పది జిల్లాల్లో అసైన్డ్‌ భూముల కబ్జాపై సభా సంఘం వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వెల్లడించారు. పొన్నాల లక్ష్మయ్య భూముల అంశంపై ఆయన సభలో మాట్లాడారు. గత ప్రభుత్వమే పొన్నాల భూమిని రద్దు చేయాలని ఆదేశాలిచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 90వేల ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాలో ఉందని చెప్పారు.



అంతకు ముందు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య  గత ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని, ఆ భూముల్లో ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పలేదని  ఆరోపించారు. ఆ భూముల్లో ఫౌల్ట్రీ ఫామ్ను ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో పొన్నాల లక్ష్మయ్య భూములపై హరీష్రావు చర్చించారు. తక్కువ ధరకు విక్రయించిన భూముల్లో పరిశ్రమలు నెలకొల్పకుంటే తమకు అప్పగించాలని 2013లో ఏపీఐఐసీ వెల్లడించిందని గుర్తు చేశారు. కానీ పొన్నాల మాత్రం ఆ భూములు అప్పగించలేదని విమర్శించారు.



నిబంధనలకు విరుద్ధంగా  పొన్నాల వద్ద 8.3 ఎకరాల భూమి ఉందని చెప్పారు. 2005లో మార్కెట్ ధర కంటే పొన్నాలకు తక్కువ ధరకే సదరు భూమిని ప్రభుత్వం విక్రయించిందని తెలిపారు. ఎకరం రూ. 25,500లకే కేటాయించారని హరీష్రావు తెలిపారు. అసైన్డ్ భూమిని కొనుగోలు చేయడం కానీ, విక్రయించడం కాని చేయకూడదని ఆయన వెల్లడించారు.

**

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top