నిట్ విద్యార్థుల ధర్నా
⇒ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో కొత్త నిబంధనపై నిరసన
⇒ ఎట్టకేలకు దిగి వచ్చిన డైరెక్టర్
కాజీపేట అర్బన్: వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో విద్యార్థులు సోమవారం ధర్నా చేశారు. కళాశాలలో ఏటా నిర్వహించే స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఇందుకు భిన్నంగా ఈ ఏడాది సీజీపీఏ 7.5 సాధించిన వారు పోటీకి అర్హులని నిబంధన తేవడంతోపాటు పీహెచ్డీ స్కాలర్స్ అనర్హులుగా పేర్కొంటూ నిట్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.
ఈ నెల 4న ధర్నా చేపట్టారు. మరుసటి రోజు తరగతులను బహిష్కరించారు. అదే రోజు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ తన వైఖరిని మార్చుకోకపోవడంతో సోమవారం కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. ఎట్టకేలకు దిగివచ్చిన డైరెక్టర్ జీఆర్సీ రెడ్డి ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకుండా యథాత«థంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఒప్పుకున్నారు. డైరెక్టర్ ప్రకటనతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. కాగా, నిట్లో ఈనెల 11 స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కళాశాల సిబ్బంది సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిల్ అధ్యక్షుడు, కోశాధికారి, ప్రధానకార్యదర్శితోపాటు పలు పదవులకు ఎన్నిక ప్రకియ నిర్వహించనున్నారు.