టీడీపీ హయాంలోనే ముస్లింలకు పెద్దపీట: చంద్రబాబు

టీడీపీ హయాంలోనే ముస్లింలకు పెద్దపీట: చంద్రబాబు - Sakshi


యాకత్‌పుర : గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీలకు పెద్ద పీట వేసి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి హజ్‌యాత్రకు వెళ్లే వారికి సబ్సిడీ కల్పించామని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ ఆధ్వర్యంలో బుధవారం పాతబస్తీ ఎతేబార్ చౌక్‌లోని బజాబార్ ఫంక్షన్‌హాల్‌లో పేదలకు బియ్యం, చీరలు (జకాత్) ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరై చంద్రబాబు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.



అనంతరం మాట్లాడుతూ....ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు తమ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల సంక్షేమం కోసం  తొలి ప్రాధాన్యమిచ్చామన్నారు. నగరం నుంచి హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింల కోసం నాంపల్లిలో ప్రత్యేక హజ్ హౌజ్‌ను నిర్మించామన్నారు.



యాత్రికులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సబ్సిడీ సైతం కల్పించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలకు సైతం అండగా ఉంటూ అవసరమైన మేరకు న్యాయం చేకూరుస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు జాహెద్ అలీ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ, టీడీపీ గ్రేటర్ ఉపాధ్యక్షులు, ఓల్డ్ సిటీ ఇన్‌ఛార్జి అలీ మస్కతీ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top