ఇంజనీరింగ్‌లో ‘బతుకు విద్య’

ఇంజనీరింగ్‌లో ‘బతుకు విద్య’


ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కోర్సుల్లో కొత్త సబ్జెక్టులు

 సాఫ్ట్‌వేర్ సంస్థలకు అవసరమైన ఆరు అంశాల ఎంపిక

 థర్డ్ ఇయర్ మొదటి సెమిస్టర్‌లో ప్రారంభం

 చివరి సంవత్సరంలో విద్యార్థులకు  ప్రత్యేక సమ్మర్ కోర్సులు

 పైలట్ ప్రాజెక్టుకు 20 కాలేజీల ఎంపిక

 ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి

 నాస్కామ్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు

 కసరత్తు చేస్తున్న జేఎన్‌టీయూ

 

 ఇంజనీరింగ్‌లో బతుకు విద్యను నేర్పించేందుకు హైదరాబాద్ జేఎన్‌టీయూ సిద్ధమైంది. 288 ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త సబ్జెక్టులను ప్రవేశ పెట్టడం ద్వారా ఏటా దాదాపు 15 వేల మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించేలా కసరత్తు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్)తో రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఒప్పందం చేసుకుంది. మొదట ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), కంప్యూటర్ సైన్స్ (సీఎస్‌సీ) కోర్సుల్లో కొత్త సబ్జెక్టుల ప్రవేశానికి చర్యలు చేపట్టిన జేఎన్‌టీయూ... భవిష్యత్‌లో మరిన్ని కొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్ మార్పుల్లో భాగంగా ఈ కొత్త సబ్జెక్టులను అందుబాటులోకి తీసుకువస్తోంది.

 

 అవసరాలను తేల్చిన నాస్కామ్..

 

 నాస్కామ్ తమ పరిధిలోని కంపెనీల్లో వివిధ విభాగాల్లో మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. అందులోనూ ముఖ్యంగా ఆరు ప్రధాన రంగాల్లో ఎక్కువ అవసరాలు ఉన్నట్లు తేల్చింది. ఇందులో డిజైన్ ఇంజనీర్, జూనియర్ డేటా అసోసియేట్, సెక్యూరిటీ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, అసోసియేట్ అనలిటిక్స్, టెస్ట్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ వంటి అంశాల్లో నిపుణుల అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఆయా రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు కంపెనీల అవ సరాలు తీర్చవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నాస్కామ్‌తో చర్చించింది. తాము చెప్పిన సబ్జెక్టులను ప్రవేశపెడితే తమ పరిధిలోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నాస్కామ్ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ మేరకు తాము నాస్కామ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్‌వీ రమణరావు పేర్కొన్నారు.

 

 ‘ఉపాధి’కి కొత్త సబ్జెక్టులు, కోర్సులు..

 

 ఉపాధి అవకాశాలు కల్పించే పలు సబ్జెక్టులు, కోర్సులను ప్రవేశపెట్టేందుకు జేఎన్‌టీయూహెచ్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో డిజైన్ ఇంజనీర్, జూనియర్ డాటా అసోసియేట్, సెక్యూరిటీ అనలిస్ట్, అసోసియేట్ అనలిటిక్స్ సబ్జెక్టులను మొదటి దశలో ప్రవేశ పెడుతోంది. తరువాత రెండో దశలో టెస్ట్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ సబ్జెక్టులను ప్రవేశపెట్టనుంది. ఇక భవిష్యత్‌లో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, వెబ్ టెక్నాలజీస్, జావా ప్రోగ్రామింగ్‌లో రెండు రకాల కోర్సులు,  క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డాటా అనలిటిక్స్, నెట్‌వర్క్ ప్రోగ్రామింగ్, సాకెట్ ప్రోగ్రామింగ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.

 

 15 నుంచి శిక్షణ..

 

 కొత్త సబ్జెక్టులకు సంబంధించిన ఫ్యాకల్టీకి ఐటీ కంపెనీల నిపుణులతో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలుత 100 మందికి ఏప్రిల్ 15 నుంచి శిక్షణ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఐటీ, సీఎస్‌సీ కోర్సుల్లో కోర్ సబ్జెక్టులతోపాటు ఎలెక్టివ్ సబ్జెక్టుల్లో భాగంగా ఈ కొత్త సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐటీ విభాగం ప్రొఫెసర్ విజయకుమారి పేర్కొన్నారు. బీటెక్ మూడో సంవత్సరంలోని మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్, నాలుగో సంవత్సరంలోని మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్‌లలో ఈ కొత్త సబ్జెక్టులను విద్యార్థులు చదువుకోవచ్చు. సబ్జెక్టులను ఎంచుకోవడమనేది పూర్తిగా విద్యార్థుల ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటుంది.

 

 ‘నాస్కామ్’ సర్టిఫికెట్లు..

 

 ఈ కొత్త సబ్జెక్టులతో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు నాస్కామ్ కూడా సర్టిఫికెట్లను అందజేయనుంది. నాస్కామ్ పరిధిలోని సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు నాస్కామ్ సర్టిఫికెట్‌తో ఇతర సాఫ్ట్‌వేర్ కంపెనీల్లోనూ ఉద్యోగాలు పొందడం సులభం అవుతుందని నాస్కాం రీజనల్ డెరైక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ సర్టిఫికెట్లకు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. కొత్త సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్‌ను రూపొందిస్తున్నామని, దీనిపై వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థల నిపుణులతో ఫ్యాకల్టీకి శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.

 ఫైనలియర్‌లో ప్రాజెక్టులు..

 

 ఇంజనీరింగ్ చివరి సంవత్సరం ప్రాజెక్టుల్లో భాగంగా సమ్మర్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా మొదట 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఇందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) కార్యక్రమం కింద నాస్కామ్, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్‌తోనూ జేఎన్‌టీయూ ఒప్పందం చేసుకుంది. మొబైల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ సబ్జెక్టులకు సంబంధించి ఈ ప్రత్యేక శిక్షణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

 

 కొత్త సబ్జెక్టులు ప్రవేశపెట్టనున్న కాలేజీలు -288

 నాస్కామ్ ద్వారా జేఎన్‌టీయూ ఏటా కల్పించనున్న ఉద్యోగాలు -15,000

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top