శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీఎంవోకు

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీఎంవోకు - Sakshi


హైదరాబాద్ : చిత్తశుద్ధితో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్యమంత్రి కెసీఆర్ స్పష్టం చేశారు. గ్రాండ్ కాకతీయలో నూతన పారిశ్రామిక విధానంపై ఆయన మంగళవారం  పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.  3 లక్షల ఎకరాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు.  



సింగపూర్ తరహాలో సింగిల్ విండో సిస్టం ఏర్పాటు చేస్తామని,  24 గంటల కరెంట్, 10 శాతం నీరు పరిశ్రమలకు కేటాయిస్తామని కేసీఆర్ తెలిపారు. పూర్తి పారదర్శకంగా నూతన పారిశ్రామిక విధానం ఉంటుందని, కొత్త పారిశ్రామిక విధానంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. పారిశ్రామికవేత్తలను శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సీఎంవోకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.



పరిశ్రమల ఏర్పాటులో త్వరిత అనుమతుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. అన్నింటికి 21రోజుల్లోగా అనుమతులు ఉంటాయని, ఒకట్రెండు తప్ప అన్ని అనుమతులు ఒకే రోజు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. ప్రతి సాగునీటి ప్రాజెక్టులో పది శాతం నీటిని పరిశ్రమలకు కేటాయించారు. పరిశ్రమల అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధే లక్ష్యమన్నారు. అలాగే హైదరాబాద్లో హార్డ్వేర్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top