నవవధువు బలవన్మరణం


ఉరివేసుకొని ఆత్మహత్య

మృతిపై పలు అనుమానాలు

 

ఆదిబట్ల : ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ  సంఘటన శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు అనుబంధ గ్రామం మెటిల్లకు చెందిన మధు ఆరునెలల క్రితం యాచారం గ్రామానికి చెందిన కవిత(20)ను వివాహం చేసుకున్నాడు. మధు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం కవిత తన బెడ్ రూం గదిలో ఉన్న ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత మధు పొలం నుంచి వచ్చాడు. 



లోపలి నుంచి బెడ్‌రూంకు గడియ ఉండడంతో కిటికిలోంచి చూడగా కవిత ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. దీంతో ఆయన భార్య తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి వివరాలు సేకరించారు. కాగా, కవిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందా.. లేదా కుటుంబీకులు ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top