వికారాబాద్లో ప్రధాని మోదీ సతీమణి
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్య జశోదా బెన్ శుక్రవారం తెలంగాణ రాష్ట్రం విచ్చేశారు. వికారాబాద్లోని రెండు దేవాలయాలను ఆమె సందర్శించుకున్నారు. నాగదేవత గుడిలో జశోదా బెన్ పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డన చేశారు. ఆ తర్వాత సంతోషిమాత ఆలయాన్ని జశోదా బెన్ సందర్శించి, అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి ఆమె గోమాతను కానుకగా ఇచ్చారు. అలాగే రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
కాగా జశోదా బెన్ గురువారం రాత్రే వికారాబాద్ చేరుకున్నారు. నాగదేవత ఆలయ పూజారి నివాసంలో ఆమె బస చేశారు. అయితే ప్రధాని సతీమణి వచ్చిన వార్త తెలియడంతో భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారితో కొద్దిసేపు జశోదా బెన్ మాట్లాడారు. అయితే జశోదా బెన్ మాత్రం తన రాకపై ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడకు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె శనివారం గుజరాత్ తిరుగు ప్రయాణం అవుతారు.
సంబంధిత వార్తలు