కందుల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీ
నాగల్గిద్ద (మనూరు) : మండల పరిధిలోని మావినెల్లి కందుల కొనుగోలు కేంద్రాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, స్థానిక ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ బిడెకన్నె హన్మంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వాహకులు సక్రమంగా కందుల కొనుగోళ్లు నిర్వహించడంలేదని పలువురు రైతులు ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తాము ఎన్నిమార్లు వచ్చి అడిగినా సంచుల కొరత, కందులో నాణ్యత లేదని తమను బుకాయిస్తున్నారని వాపోయారు. దీంతో ఎంపీ కొనుగోలుకు సంబంధించి స్టాక్ వివరాలు అడగడంతో నిర్వాహకులు ఎలాంటివి లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్వహకులు కిశోర్ను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చెయ్యగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఎంపీ సంబంధిత నిర్వహకులకు సంబంధించిన నివేదిక తనకు వెంటనే అందచెయ్యాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను వేధిస్తే సహించేది లేదన్నారు. స్థానిక రైతుల కందులక వంకలు పెడుతూ పక్కరాష్ట్రాల కందులను కొనుగోలు చెయ్యడం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ నిరంజన్, ఎంపీపీ లక్ష్మీగణపతి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బాసిత్, రవీందర్నాయక్, అశోక్ శెట్కార్ తదితరులు ఉన్నారు.