క్షణికావేశానికి కుటుంబం బలి
♦ మద్యంమత్తులో ఇద్దరు పిల్లలను చంపుకున్నతల్లి
♦ తానూ ఆత్మహత్య హన్వాడ మండల కేంద్రంలో విషాదం
మహబూబ్నగర్ క్రైం(హన్వాడ) : ఓ తల్లి మద్యంమత్తు, క్షణికావేశం వెరసి.. ఇద్దరుపిల్లల ప్రాణాలు తీసింది. తనతో పాటు చిన్నారులకు నిప్పంటించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి హన్వాడ మండలకేంద్రంలో కలకలం సృష్టించింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా గండ్వీడ్ మండలం ముకర్లబాద్ గ్రామానికి చెందిన కృష్ణవేణి(30)ని హన్వాడ మండలకేంద్రానికి చెందిన ఆంజనేయులు వివాహం చేసుకున్నాడు. వారికి కల్యాణి(5), ప్రశాంతి(2) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఆంజనేయులు తాపీమేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కృష్ణవేణి కూడా వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేది. ఈ క్రమంలో కృష్ణవేణి కల్లుకు బానిసైంది. కల్లు తాగినిదే ఆమెకు నిద్రపట్టేదికాదు. దీంతో భార్యాభర్తల మధ్య ఇద్దరు కూతుళ్ల పెంపకంపై చిన్నచిన్న గొడవలు జరిగేవి. కొడుకు పుట్టలేదని పలుమార్లు భార్యతో గొడవపడేవాడు. గతంలో కృష్ణవేణి తోటికోడలుతో కూడా గొడవపడింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సందర్భాలూ ఉన్నాయి.
ఏం జరిగిందంటే..
మంగళవారం రాత్రి కృష్ణవేణి ఇద్దరుపిల్లలు భోజనం చేస్తూ పక్కింట్లో తమ పెద్దనాన్న ఇంటికి వెళ్లారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమె పిల్లలను కొట్టుకుంటూ ఇంట్లోకి తీసుకెళ్లింది. దీంతో తోటికోడలుతో మరోమారు గొడవ జరిగింది. ఆ సమయంలో కృష్ణవేణి భర్త ఇంట్లో లేడు. ఇదిలాఉండగా, మనస్తాపానికి గురైన కృష్ణవేణి రాత్రి 11 గంటల ప్రాంతంలో తన ఇద్దరు కూతుళ్లపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటలు ఆర్పివేసేందుకు యత్నించిన పెద్దకూతురును కత్తితో గొంతుకోసింది.
అనంతరం తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కొద్దిసమయానికే కృష్ణవేణి మృత్యువాతపడింది. తీవ్రంగా గాయపడిన పిల్లలను అర్ధరాత్రి సమయంలో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. విషయం తెలియడంతో సంఘటనస్థలాన్ని మహబూబ్నగర్ రూరల్ సీఐ శ్రీనివాసులు పరిశీలించారు. మృతదేహలకు బంధువులకు అప్పగించారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
సంబంధిత వార్తలు