ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ : ముగ్గురి మృతి
నరసింహులపేట : వేగంగా వెళుతున్న లారీ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఓ కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా నరసింహులపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... నరసింహులపేట మండలంలోని బీరిశెట్టిపల్లి గ్రామానికి చెందిన బండి సునీత(35) అనే మహిళ కుమారుడు రాహుల్(15), కూతురు ప్రగతి(13)లతో కలసి చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. వరంగల్, ఖమ్మం జాతీయ ప్రధాన రహదారి పక్కనే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని అందులోనే హోటల్ నడుపుకుంటున్నారు. అయితే వారు అక్కడే నిద్రిస్తుండగా శనివారం తెల్లవారుజామున ఖమ్మం వైపు వెళుతున్న లారీ వేగంగా ఇంట్లోకి దూసికెళ్లింది. దీంతో ఇంట్లో ఉన్న తల్లితో పాటు ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.