పగలు, రాత్రి తేడా లేకుండా నట్టింట్లో..

పగలు, రాత్రి తేడా లేకుండా నట్టింట్లో..


► రూ.వంద నుంచి వేల రూపాయల్లో బెట్టింగులు

►ట్రెండ్‌ మార్చిన పేకాటరాయుళ్లు

►పగలు, రాత్రి తేడా లేకుండా సెల్‌ఫోన్‌లో ఆట




వీణవంక: పచ్చని సంసారాల్లో ‘ఆన్‌లైన్‌’ పేకాట చిచ్చురేపుతుంది. ఒకప్పుడు ఇంటి పరిసరాలు, పొలం గట్లు, చెరువులు, కుంటల వద్ద ఆట ఆడే పేకాటరాయుళ్లు.. ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ అందుబాటులోకి రావడంతో ‘ఆన్‌లైన్‌’ పేకాట మోజులో పడ్డారు. పగలు, రాత్రి తేడాలేకుండా నట్టింట్లో నుంచే పేకాట ఆడుతూ రెక్కల కష్టం పేకాటకే తగలేస్తున్నారు.



జిల్లాలో ఆన్‌లైన్‌ పేకాటరాయుళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.  పొద్దంత పనిచేసి సంపాదించిన సొమ్మును కొంత మంది పేకాట ఆడి పోగుట్టుకుటుండగా, మరి కొందరు డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆడుతున్నారు. పోలీసులు రోజుకో కేసు నమోదు చేస్తున్నా వారి ఆగడాలకు అడ్డకట్ట వేయలేకపోతున్నారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఆన్‌లైన్‌ పేకాటలో ఒకే రోజు రూ.30 వేలు పొగొట్టుకున్నాడు.  



ట్రెండ్‌ మారింది.

పేకాటరాయుళ్లు తమ ట్రెండ్‌ను మార్చారు. బహిరంగంగా ఆడితే పోలీసులకు పట్టుబడుతున్నామని గ్రహించి ఆన్‌లైన్‌ పేకాటకు తెరలేపారు. గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో రూ.వంద నుంచి వేల రూపాయల్లో బెట్టింగ్‌లు పెట్టి ఆడుతున్నారు. వీణవంక మండలంలో ఈ ఆన్‌లైన్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇంట్లోనే ఎవరికీ అనుమానం రాకుండ సెల్‌ఫోన్‌లోనే ఆడుతున్నారు. డబ్బులు అర్జించిన సంగతి దేవుడెరుగు ...డబ్బులు పొగుట్టుకున్న వారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. ఆన్‌లైన్‌ పేకాటలో కూలీ పని చేసుకుని బతుకేవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. గ్రామాల్లో సాగుతున్న ఆన్‌లైన్‌ పేకాటతో మోసపోతున్న ప్రజలకు అవగాహన కల్పించి, పేకాటరాయుళ్లపై ఉక్కుపాదం మోపాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top