మోదీ పెద్ద అబద్ధాల కోరు: సురవరం
-
మే14న భూసేకరణ ఆర్డినెన్స్పై దేశవ్యాప్త ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద అబద్ధాల కోరని, మల్టీ మిలియనీర్లు, ఎమ్మెన్సీలు, కార్పొరేట్సంస్థల ప్రత్యక్షఏజెంట్ అని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతుల నుంచి భూమిని బలవంతంగా లాక్కుంటూనే, భూసేకరణ చట్ట సవరణ వల్ల వారికి ప్రయోజనం కలుగుతుందని ప్రచారం చేయగలిగే దిట్ట మోదీ అని విమర్శించారు. కేంద్రం మళ్లీ భూసేకరణ చట్టసవరణ ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో వచ్చేనెల (మే) 14న సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలు, ఆందోళనలను చేపడుతున్నట్లు ప్రకటించారు.
ఇటీవల పుదుచ్చేరిలో జరిగినసీపీఐ మహాసభల్లో జాతీయ ప్రధానకార్యదర్శిగా ఆయన మరోమారు ఎన్నికైన నేపథ్యంలో బుధవారం మఖ్దూంభవన్లో పార్టీ నేతలు డా.కె.నారాయణ, అజీజ్పాషా, చాడ వెంకటరెడ్డి, కె. రామకృష్ణలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలతో పాటు, దేశానికి నల్లడబ్బును తిరిగి తీసుకురావడం, తదితర వాగ్దానాల భంగంపై ప్రజలను చైతన్యపరుస్తామన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ తమదేనని బీజేపీ చెబుతున్న అం శంపై స్పందిస్తూ అది వాపు తప్ప బలుపు కాదన్నారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఢిల్లీ ఎన్నికలే నిదర్శన మన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీకి జరిగిన నష్టాన్ని గుర్తుంచుకొని పార్టీలో కొత్త ఉత్సాహాన్ని కలిగించి నిర్మాణాన్ని పటిష్టపరచాలని మహాసభల్లో నిర్ణయించినట్లు సురవరం తెలిపారు.
ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా కవల పిల్లలని, వారిద్దరు కలిసి దేశంలో మతోన్మాదం పెంచేందుకు కుట్రలు పన్నుతున్నారని సీపీఐ జాతీ య కార్యదర్శివర్గసభ్యుడు నారాయణ విమర్శిం చారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలపై అంతర్రాష్ట పన్నును వేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఏకపక్ష నిర్ణయాలు మానుకుని సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సీఎం కేసీఆర్కు సూచించారు.