మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం


నాగోలు (హైదరాబాద్) : మానసిక పరిస్థితి సరిగా లేని ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్లపల్లికి చెందిన ఓ కుటుంబం 4 సంవత్సరాల క్రితం బ్రతుకుదెరువు కోసం నగరానికి వచ్చి హస్తినాపురం ఇంద్రప్రస్థకాలనీలో నివాసముంటున్నారు. తల్లి, అన్న, వదినతో పాటు ఓ బాలిక(16) నివాసముంటుంది. నెల రోజుల క్రితమే బాలిక గ్రామం నుంచి అన్న వద్దకు వచ్చింది. కుటుంబసభ్యులు స్థానికంగా ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. కాగా ఇదే కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌లు శివ, అనిల్‌లు బాలికపై కన్నేశారు. గతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లిన వీరిద్దరూ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలికను శివ, అనిల్‌లు బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని ఔటర్‌రింగురోడ్డు సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ నెల 28వ తేదీన బాలికను గుర్రంగూడలో ఫ్లైటెక్ ఏవియేషన్ కళాశాల వద్ద వదిలేశారు.



అయితే అప్పటికే కుటుంబ సభ్యులు బాలిక కోసం పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. గుర్రంగూడ నుంచి ఆదిభట్ల వరకు నడుచుకుంటూ వెళ్లిన మైనర్ బాలికను బంధువులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లి బాలికను తీసుకొచ్చారు. బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కుటుంబ సభ్యులు ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన ఎల్‌బీనగర్ పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్ శివ, అనిల్‌లను వెంటనే అరెస్ట్ చేసి కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తురన్నారు. వీరికి మరో యువకుడు సహకారం అందించినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top