తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని మరువలేం

తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని మరువలేం


- ఢిల్లీ బతుకమ్మ ఉత్సవాల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

- హాజరైన కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి ఈటల

 

 సాక్షి, న్యూఢిల్లీ:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఎ న్నటికీ మర్చిపోలేమని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా తొలుత తెలంగాణ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.



ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలంగాణ సంప్రదాయం ప్రకారం.. గౌరమ్మను పూజించి, రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను ఎత్తుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తానూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాననీ, ఆనాటి ఉద్యమ రూపాల్ని, ప్రజల స్పందనను గుర్తు చేసుకున్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు.



రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పండుగలకు, సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రం నిలయమనీ, పంటలన్నీ చేతికొచ్చాక ప్రజలు సంతోషంగా జరుపుకొనే ప్రకృతి పండుగ.. బతుకమ్మ అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్, రాపోలు ఆనంద్ భాస్కర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఎస్.వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top