కంపెనీ ఉందని నిరూపిస్తే రాసిస్తా: కేటీఆర్
హైదరాబాద్: తనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని తమపై ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు. జైరాం రమేశ్ ఎప్పుడైనా ప్రజల ఓట్లతో గెలిచారా అని ప్రశ్నించారు. తనకు కంపెనీ ఉందని నిరూపిస్తే కాంగ్రెస్ నేతలకు రాసిస్తానని ప్రకటించారు. జైరాం రమేశ్కు సిగ్గు శరం ఉంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ హయాంలో ఇసుకాసుర పాలన జరిగిందని విమర్శించారు. ఇసుకపై ఈ ఏడాది రూ.600 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ‘మీలా కుంభకోణాల్లో ఇరుక్కుపోయే అలవాటు మాకు లేద’ని వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. దిగ్విజయ్ సింగ్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. సిరిసిల్లకు పోయి ఏం చెబుతారు, ఉరిసిల్లగా మార్చామని చెబుతారా అని ప్రశ్నించారు. ఉనికి ఉండదేమోనన్న భయంతో విపక్షాలు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాయని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.