లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి కృషి

లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి కృషి


రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

 

 మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ లోఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఈదులగూడెంలో రూ.1.13 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11కేవీ ఉప కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ కొరత లేకుండా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపడుతోందన్నారు. థర్మల్ ప్లాంట్ పూర్తయితే రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తొలగనున్నాయన్నారు. చీప్ లిక్కర్‌పై ప్రతిపక్ష పార్టీల నాయకులు కొంత మంది రాజకీయ స్వార్థం కోసం రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.



గుడుంబా వ్యవస్థను పూర్తి స్థాయిలో నివారించేందుకు రెండు వేల కోట్ల రూపాయలు నష్టమైనప్పటికీ తక్కువ ధరలతో మద్యంను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టిందన్నారు. కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, స్థానిక ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ తిరునగ రు నాగలక్ష్మిభార్గవ్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు తేరా చిన్నపరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గాయం ఉపేందర్‌రెడ్డి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, స్థానిక కౌన్సిలర్‌లు ముదిరెడ్డి సందీపనర్సిరెడ్డి, మన్నెం దేవకమ్మ లింగారెడ్డి, పశ్యా శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ కిషన్‌రావు, తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ రావిరాల ధనుంజయ, అమృతం సత్యం, తమ్మన్న, జొన్నలగడ్డ రంగారెడ్డి,  షహనాజ్‌బేగం తదితరులున్నారు.

 

 జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

 హాలియా: జిల్లా సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురానం, నిడమనూరు, హాలియా, పెద్దవూర మండలాల్లో పలు గ్రామాల్లో వివిధ సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హాలియా మండలం రామడుగు గ్రామంలో రూ. కోటి 20 లక్షలతో  నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం  తిరుమలగిరిలో సుమారు రూ. 3 కోట్లతో నిర్మించనున్న మార్కెట్ గిడ్డంగులకు ఆయన భూమిపూజ చేశారు.



అనంతరం మంత్రి మాట్లాడుతూ  ఈ ఏడాది నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరులేకపోవడంతో రైతులు బోరుబావుల కింద వరి, ఇతర పంటలు సేద్యం చేస్తున్నారని రైతులకు ఎక్కడా విద్యుత్ అంతరాయం కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.  కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్‌ఎస్ నియోజకరవర్గ ఇన్‌చార్జ్ నోముల నర్సింహయ్య, ఎంపీపీ అల్లినాగమణి, జెడ్పీటీసీ  నాగమణి, ఆర్డీఓ కిషన్‌రావు,  ఎక్కలూరి శ్రీనివాసరెడ్డిరెడ్డి, మల్గిరెడ్డి లింగారెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top