'ఊళ్లో జనాలు రాకుంటే బయట జనాలతో ధర్నాలా!?'


సుల్తానాబాద్ (కరీంనగర్) : తోటపల్లి రిజార్వాయర్ డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ టీపీసీసీ ధర్నాను మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఆందోళన కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి స్పందన కరువవడంతో కర్నూలు జిల్లా నుంచి కార్యకర్తలను అరవు తెచ్చుకున్నారని మంత్రి ఆరోపించారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో సోమవారం రూ. 3 కోట్లతో నిర్మాణం చేపట్టే గోదాములకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. అభివృద్ది గురించి ఆలోచించలేదని.. కమీషన్‌లు, కాంట్రాక్ట్‌ల కోసం ఆలోచన చేశారని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, మంజీర నదులపై 50 ప్రాజెక్ట్‌లు కడుతుంటే అడ్డుపడని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు విమర్శిస్తుందన్నారు.



రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేల 24 కోట్లతో 17 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు అన్ని రకాల వసతులతో నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. రూ. 840ల కోట్లతో పలు ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తామని చెప్పారు. తోటపల్లి రిజర్వాయర్‌పై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని, 6 ఊళ్లు మునిగిపోతాయని తెలిసినప్పటికీ డిజైన్ మార్చవద్దని చెప్పడం చూస్తే ప్రజలు ఎటుపోయినా పర్వాలేదు కానీ రాజకీయదృష్టితో చూస్తామనడం సరికాదన్నారు. వారు చెప్పిన విధంగా నిర్మాణం చేస్తే 3 వేల ఎకరాలకు పంట నష్టంతో పాటు 11 వందల కోట్లు నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top