మా హయాంలోనే ప్రాజెక్టులకు మోక్షం

మా హయాంలోనే ప్రాజెక్టులకు మోక్షం - Sakshi

- భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసి వదిలేసిందని విమర్శ

 

పెద్దశంకరంపేట (మెదక్‌): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే పెండింగ్‌ ప్రాజెక్టులకు మోక్షం లభించిందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శనివారం మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులను మంజూరు చేసి వదిలేసిందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తోందన్నారు. సింగూరు కింద సాగవుతున్న అందోల్, అన్నాసాగర్‌ చెరువుల ఆయకట్టు కింద పచ్చదనం వెల్లివెరుస్తోందని చెప్పారు.



గత యాసంగిలో 35 వేల ఎకరాలకు సింగూరు ద్వారా నీరందించామని, ఈ ఖరీఫ్‌లో 40 వేల ఎకరాలకు నీరందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు ఖమ్మంలో పాలెంవాగు, కిన్నెరసాని ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. ఆదిలాబాద్‌లో సైతం ఐదు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేశామని, మహబూబ్‌నగర్‌లో ఈ ఖరీఫ్‌లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తున్నామని, కరీం నగర్‌ మంథనిలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా పంటలను సాగులోకి తెచ్చామని హరీశ్‌రావు వివరించారు. తెలంగాణలో 34 ప్రాజెక్టులను తమ ప్రభుత్వ హయాంలోనే చేపట్టామన్నారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ఐదు ఎత్తిపోతల ప్రాజెక్టులనుత పూర్తి చేశామని చెప్పారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top