24కు బదులు 94


గోదావరిఖనిటౌన్ :మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలకు పాల్పడుతున్న ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి విషయం డీఈవో ఆకస్మిక తనిఖీలో వెల్లడైంది. గోదావరిఖని గాంధీనగర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో 24 మంది విద్యార్థులు ఉండగా ప్రతీ దినం 94 మంది విద్యార్థులు వస్తున్నట్లు రిజిస్టర్‌లో హెచ్‌ఎం వెంకటేశ్వర్లు చూపిస్తున్నారు. శనివారం డీఈవో లింగయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించడంతో విషయం వెలుగుచూసింది. కేవలం ఇరవై మంది లోపే విద్యార్థులు భోజనం చేస్తున్నట్లు బయటపడింది. కొంతకాలంగా సాగుతున్న ఈ తంతులో రూ.లక్షల్లో అక్రమాలు జరిగాయని తెలుస్తోంది.  



అందరూ అందరే..

ఈ అక్రమాలు పాఠశాల సిబ్బందికి, ప్రధానోపాధ్యాయుడికి తెలిసే జరుగుతున్నాయని తెలిసింది. రెండేళ్లుగా ఇలా చేస్తున్నారని, ఈ విషయంలో ఉపాధ్యాయులు, సిబ్బంది అంతా కుమ్మక్కయ్యారని తెలుస్తోంది. ప్రతీ విద్యార్థికి రోజుకు రూ.4 చొప్పున ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ లెక్కన అక్రమాలు లక్షల్లో జరిగినట్లు సమాచారం.

 

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

ప్రభుత్వ పాఠశాలల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి లింగయ్య హెచ్చరించారు. విద్యార్థుల సంక్షేమాన్ని చూడాల్సిన ఉపాధ్యాయులు ధనార్జన కోసం, వారి జీవితాలతో ఆటలాడద్దని అన్నారు. గోదావరిఖని బాలుర పాఠశాలలో అక్రమాలకు పాల్పడిన ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లుపై వేటు పడక తప్పదని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం, విద్యార్థుల శ్రేయస్సు కోసం మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top