డాక్టర్ కాకుండానే...

డాక్టర్ కాకుండానే... - Sakshi


 కోదాడరూరల్ : ఎంతో కష్టపడి మెడికల్ సీటు సాధించి కాలేజీలో చేరేందుకు వెళుతున్న ఓ విద్యార్థిని కలలు మార్గమధ్యలోనే కల్లలయ్యాయి. మరో రెండు గంటల్లో గమ్యస్థానానికి చేరే వారికి అనుకోని ఆపద ఎదురైంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో మెడికల్ విద్యార్థిని దుర్మరణం పాలవ్వగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని దుర్గాపురం బైపాస్‌రోడ్డులో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ తిలక్‌నగర్‌కు చెందిన గొలుసు నర్సయ్య కుతూరు సుష్మ(18), వనస్థలిపురానికి చెందిన ముగుళ్ల మహేందర్‌రెడ్డి కూతురు మనీషారెడ్డి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో సీట్లు సాధించారు. వారిద్దరిని కళాశాలలో చేర్పించేందుకు నర్సయ్యతో పాటు ఆయన కు మారుడు సుమిత్, మహేందర్‌రెడ్డి, ఆయన భార్య సుష్మలు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు.

 

 ఉదయం ఏడు గంటల సమయంలో కోదాడ మండలం దుర్గాపురం బైపాస్ వద్దకు రాగానే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కోదాడలోకి వచ్చేందుకు వేగంగా మలుపు తిరుగుతుండగా అంతేవేగంతో వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గొలుసు సుష్మ, సుమిత్, మహేందర్‌రెడ్డి అతడి భార్య సుష్మ, కారుడ్రైవర్ రాంభూపాల్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. మనీషారెడ్డి, నర్సయ్య, మహేందర్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అందరినీ కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో గొలుసు సుష్మ, సుమిత్, సుష్మల పరిస్థితి విషమం గా ఉండటంతో వారిని ఖమ్మం తరలిస్తుండగానే గొలుసు సుష్మ మృతిచెందింది. సుష్మ తమ్ముడు సుమిత్ పరిస్థితి కూ డా విషమంగా ఉండటంతో అతడిని ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యామేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top