మావోయిస్టుల ఊసే లేదు

మావోయిస్టుల ఊసే లేదు - Sakshi


కల్వకుర్తి : కల్వకుర్తి, అచ్చంపేట, జడ్చర్ల నియోజకవర్గం పరిధిలో చెక్‌జంగ్ అనే పేరుతో మావోయిస్టుమంటూ పోస్టర్లు వేయడం ఆకతాయిల పనేనని ఓఎస్‌డీ చెన్నయ్య కొట్టిపారేశారు. ఆయా ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో నక్సల్స్ ఊసేలేదని, కేవలం ఆకతాయిల అయిఉంటారని తేల్చారు. బుధవారం ఆయన కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఓఎస్‌డీ విలేకరులతో మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకు కొందరు వ్యక్తులు పనిగట్టుకొని పోస్టర్లు వేస్తున్నారని అన్నారు.

 

 పోస్టర్లు వేసిన వారిని మరో రెండు, మూడు రోజుల్లో అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. చెక్‌జంగ్ పేరు మావోయిస్టులకు సంబందించిన దళాలకు లేదని, ఏదో ఒక పేరు చెప్పి ప్రజలను భయపెట్టే వారిని కఠినంగా శిక్షిస్తామని ఓఎస్‌డీ హెచ్చరించారు. రాడికల్స్, నక్సల్స్ భావాలున్న వ్యక్తులపై సైతం ఆరా తీస్తున్నట్లు చెప్పారు. సమాజంలో శాంతిని పెంపొందిస్తూ, ప్రజల సఖ్యత కోసం కృషిచేస్తామన్నారు. సమావేశంలో షాద్‌నగర్ డీఎస్పీ ద్రోణాచార్యులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top