కూతురు పుట్టిందని..!


-చంపేస్తామంటూ బెదిరింపులు

- అత్త, మామ, మరిది వేధింపులతో ఓ వివాహిత వేదన

- కుమార్తెకు, తనకు న్యాయం చేయాలంటూ బాలల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధితురాలు


 


హైదరాబాద్: కూతురు పుట్టిందని ఓ తండ్రి నాలుగేళ్లుగా ముఖం చాటేశాడు. అత్త, మామ, మరిది వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత న్యాయపోరాటం చేస్తోంది. తన కూతురిని కొడుతూ, తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ఉమ్మడి రాష్ట్రాల బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను ఆశ్రయిచింది. నారాయణగూడలోని కుబేరా టవర్స్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు మాట్లాడుతూ కుమార్తెను, తనను వేధిస్తున్నారంటూ నగరానికి చెందిన భగవత్‌రెడ్డి కుమార్తె అర్చన తమకు ఫిర్యాదు చేసిందన్నారు.



మహబూబ్‌నగర్ జిల్లా కానపూర్ సమీపంలోని తలకోలపల్లికి చెందిన జగత్‌రెడ్డి, పుష్పలత కుమారుడు వెంకట పద్మ నారాయణరెడ్డికి హైదరాబాద్‌కు చెందిన భగవంత్‌రెడ్డి కుమార్తె అర్చనను ఇచ్చి 2011లో వివాహం చేశారని తెలిపారు. 2012 ఆగస్టులో వీరికి ఓ కుమార్తె జన్మించిందనీ, ఆడపిల్ల పుట్టిందనే కోపంతో దుర్భాషలాడుతూ భర్త వెంకటవ నారాయణరెడ్డి తిరిగి అమెరికా వెళ్లిపోయాడన్నారు. అప్పటి నుంచి నేటి వరకు తిరిగి ఇండియాకు రాలేదన్నారు. భార్య అర్చన ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ అతను స్పందిచడం లేదని వివరించారు. దీంతో పాటు అత్త, మామలు జగ్‌రెడ్డి, పుష్పలతలు నా కొడుక్కి మీరు అక్కర్లేదంటూ దుర్భాషలాడి ఇంట్లో నుంచి గెంటేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో అర్చన మరిది ఎం.రాఘవేందర్‌రెడ్డి చిన్నారిని బెల్టుతో కొట్టడం, చంపేస్తానని బెదిరించడం చేశారన్నారు. దీంతో వేదనకు గురైన అర్చన తన కూతురుకు రక్షణ కావాలంటూ న్యాయం చేయమని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను ఆశ్రయిచిందన్నారు.




రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డిసిపిలకు నోటీసులు

అర్చన ఫిర్యాదు మేరకు జూన్ 16వ తేదీ లోపు విచారించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డీసీపీలకు నోటీసులను జారీ చేశామని అచ్యుతరావు తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోమారు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న అర్చన భర్త వెంకట నారాయణరెడ్డిని నగరానికి రప్పించి చర్యలు తీసుకోవాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top