ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పార్శిగుట్ట సంజీవపురంకు చెందిన భాగ్యరేఖ, చంద్రశేఖర్లు భార్యాభర్తలు. ప్రైవేటు ఉద్యోగి అయిన చంద్రశేఖర్ కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా ఈనెల 28వ తేదీ రాత్రి మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య వివాదం నెలకొంది. మద్యం మత్తులో చంద్రశేఖర్ టీవీతోపాటు ఇతర సామాన్లను పగులగొట్టాడు. భయపడిన భార్య దగ్గరలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఉదయం వచ్చింది. అయితే గడియ పెట్టి ఉన్న తలుపులు ఎంతసేపు కొట్టినా తెరవలేదు. అనుమానం వచ్చి కిటికీలోనుంచి చూడగా చంద్రశేఖర్ లుంగీతో సీలింగ్ఫ్యానుకు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. స్థానికుల సహాయంతో తలుపులు బద్దలుకొట్టి మృతదేహాన్ని కిందికి దించి పోలీసులకు సమాచారం అందించారు. భార్య భాగ్యరేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.